నిజామాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పసుపు పంట క్రయవిక్రయాలకు పేరుగాంచిన నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్.. ఆమ్చూర్ (వరుగు పొడి) పంట అమ్మకాలకూ పెట్టింది పేరు. ఈ పంట క్రయవిక్రయాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ఏకైక మార్కెట్ ఇదే. అనేక జిల్లాల నుంచి ఆమ్చూర్ను అమ్ముకునేందుకు మామిడి రైతులు వాహనాలను కిరాయికి తీసుకుని నిజామాబాద్కు వస్తుంటారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారంతా ఇక్కడ అందుబాటులో ఉన్న ధరలకు అమ్ముకోవడం తప్ప వేరే మార్గమే లేదు. తెచ్చిన పంటను అమ్ముకోకుండా వెనక్కి వెళ్తే కిరాయి డబ్బులు మీద పడుతాయని వ్యాపారులు కోట్ చేసే ధరలకే నోరెత్తకుండా అమ్ముకోవాల్సి వస్తున్నది. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు, దళారులు రైతులను నిండా ముంచుతున్నారు. నాణ్యతను సాకుగా చూపి వారు నిర్ణయించిన ధరకే కొనుగోలు చేస్తున్నారు. క్వింటా ఆమ్చూర్ పంటను 30 వేలకు కొనాల్సి ఉండగా.. 20 వేలకే కొంటూ రైతులను నిలువునా దోచుకుంటున్నారు. మామిడి రైతులకు కూలీల ఖర్చులు, కిరాయిలు, తోటల అద్దెల చెల్లింపులు కూడా మిగలడం లేదని వాపోతున్నారు. ఇందూర్ మార్కెట్లో ఇంత పెద్దఎత్తున దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. దళారులు, వ్యాపారులకే కొమ్ముకాస్తున్నదని మామిడి రైతులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా నిజామాబాద్ మార్కెట్లో ఆమ్చూర్కు సరైన ధర దక్కక రైతన్నలు బేజారవుతున్నారు.
ఆమ్చూర్ కొనుగోళ్లలో కొంత మంది వ్యాపారుల తీరు వివాదాస్పదమవుతున్నది. సుదూరాల నుంచి వచ్చే రైతుల అవసరాలను సొమ్ము చేసుకుంటూ తక్కువ ధరకు కొనుగోళ్లు చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నాణ్యతను నిర్ధారించేందుకు మార్కెట్లో శాస్త్రీయమైన పద్ధతంటూ లేదు. రైతులు తెచ్చిన ఆమ్చూర్ను కేవలం పైపై దశలోనే చూసి ధరను నిర్ధారిస్తున్నారు. ఎండిన మామిడిని చేతితో ముట్టి చూడటం తప్ప ఇతరత్రా మార్గాలు లేవు. దీంతో ఏదో ఒకటి రంగు మారింది కనిపిస్తే ఇక రైతు పరిస్థితి అంతే సంగతి. క్వింటా ధర 30 వేలు పలుకాల్సిన పంట ఒక్కసారిగా 20 వేలకే పడిపోతుండటం నిత్యం కనిపిస్తున్నది. ఈ వ్యవహారాలపై మార్కెటింగ్ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉన్నప్పటికీ అలాంటిదేమీ లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపారుల విక్రయాలపైనా నిఘా పెట్టాల్సి ఉండగా ఆన్లైన్ పేరిట ఈ-నామ్పైనే భారాన్ని మోపి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలొస్తున్నాయి.
‘గిట్టుబాటు ధర లేక ఆమ్చూర్ విలవిల’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిలో బుధవారం ప్రచురితమైన కథనంపై వ్యవసాయ మార్కెటింగ్ శాఖ స్పందించింది. ఈ అంశంపై నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ బాధ్యులను వివరాలు ఆరా తీశారు. శ్రద్ధానంద్ గంజ్ మార్కెట్లో 2014 నుంచి వ్యాపార లావాదేవీలు అన్నీ ఈ-నామ్ ద్వారానే జరుగుతున్నాయి. మే నెలలో మాత్రమే ఆమ్చూర్ మార్కెట్కు వస్తుంది. రైతులు తెచ్చిన ఆమ్చూర్ను కుప్పలుగా పోసి లాట్ నెంబర్లను పెడతాము. తద్వారా వ్యాపారులు కుప్పల వద్దకు వచ్చి సరుకు నాణ్యతను పరిశీలించి యూజర్ ఐడీని నోట్ చేసుకుని ధరలను రహస్యంగా ఆన్లైన్లో కోట్ చేస్తారు. ఈ పద్ధతి ద్వారా దళారులు, వ్యాపారులు సిండికేట్ అవ్వడానికి అవకాశమే లేదు. మహబూబ్నగర్, జడ్చర్ల, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట ప్రాంతాల నుంచి ఆమ్చూర్ను నిజామాబాద్ మార్కెట్కు తీసుకొస్తున్నారు. మంచి నాణ్యత గల ఆమ్చూర్కు రూ.25 వేల నుంచి రూ.32,700 వరకు ధర పలుకుతున్నది. నాణ్యతలేని రంగు మారిన సరుకుకు రూ.8 వేల నుంచి రూ.25 వేలకు ధర పలుకుతున్నదని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ వెంకటేశం వివరించారు.
ఏటా సీజన్లో మామిడి తోటలను గుత్తకు పట్టుకుని ఆమ్చూర్ తయారు చేస్తుంటం. కూలీల ఖర్చులు భారీగా పెరిగినయి. ఆమ్చూర్ ధర మాత్రం పెరగడం లేదు. కాయ కోసి, పొట్టు తీశాక ఆమ్చూర్ తయారీకి వం ద కాయలకు 50 నుంచి 70 దాకా చెల్లింపు లు చేస్తున్నం. తోట యజమానికి, కూలీలకు, రవాణాకు భారీ ఖర్చు అవుతుంది. మిగిలేది చెట్టుకు రూ.5 వేలలోపే ఉంటున్నది. ఆమ్చూర్ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలె.
– శివరాం, మామిడి రైతు, రాఘవపురం, సిద్దిపేట