Gurukula Recruitment | హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఇటీవల అలాట్మెంట్ ఆర్డర్ అందుకున్న గురుకుల అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చే అంశంపై ఇప్పుడు సందిగ్ధత నెలకొన్నది. ఒకవేళ ఎన్నికల కోడ్ ముగిసేవరకూ పోస్టింగ్లు ఇవ్వకపోయినా, ప్రత్యేక అనుమతులు తీసుకోకపోయినా సర్వీస్రూల్స్ ప్రకారం.. సదరు అభ్యర్థుల అలాట్మెంట్ ఆర్డర్లు రద్దయ్యే అవకాశం ఉన్నదని విస్తృతంగా ప్రచారం జరుగుతుండటంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే పలువురు నిపుణులు మాత్రం ఇలాంటి భయాలను కొట్టిపారేస్తున్నారు. 60 రోజుల నిబంధన అనేది పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చిన తేదీ నుంచి మాత్రమే వర్తిస్తాయని చెప్తున్నారు. అయితే అడ్హాక్ పద్ధతిలో పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉన్నదని మరోవైపు ఇంకొందరు వివరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో తొమ్మిది క్యాటగిరీల్లో మొత్తంగా 9,210 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టిన తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) ఇటీవల అందులో 8,708 పోస్టులకు ఫలితాలు ప్రకటించింది. ఇందులో 8,304 మంది అభ్యర్థులను గురుకులాలు అందజేసిన ఇండెంట్ల ప్రకారం ఆయా సొసైటీలకు అలాట్ చేసింది. డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ, పీడీ, లైబ్రేరియన్ క్యాటగిరీల్లో ఎంపికైన అభ్యర్థులను సొసైటీలకు కేటాయిస్తూ అలాట్మెంట్ ఆర్డర్లను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా గత నెల 15న, ఈ నెల 4న రెండు దఫాలుగా ఎల్బీ స్టేడియం వేదికగా అందజేసింది.
అలాట్మెంట్ ఆర్డర్లు అందుకున్న అభ్యర్థులు తమకు కేటాయించిన సొసైటీల్లో రిపోర్టు చేయాల్సి ఉన్నది. సదరు అభ్యర్థులకు ఆయా సొసైటీలు మరోసారి కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉన్నది. అయితే ఎన్నికల కోడ్ రావడంతో పోస్టింగ్లు ఇస్తారా? ఇవ్వరా? అన్న అంశంపై సందిగ్ధత నెలకొన్నది. ఒకవేళ 60 రోజుల్లోగా పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వకుంటే అలాట్మెంట్ ఆర్డర్స్ రద్దవుతాయనే ప్రచారం అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నది. ఇప్పటికే అలాట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి నెల దాటిందని, మరో నెల గడువు మాత్రమే ఉన్నదని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఎన్నికల కోడ్ దాదాపు 80 రోజులపాటు అమలులో ఉంటుంది. అయితే, అలాట్మెంట్ ఆర్డర్ 60 రోజుల్లో రద్దు కాదని, ఆ నిబంధన పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చినప్పటి నుంచి మాత్రమే వర్తిస్తుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ట్రిబ్ స్పష్టతనివ్వకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొన్నది.
గురుకులాల్లో ప్రమోషన్ల సమస్య
అలాట్మెంట్స్ ఆర్డర్స్ అందుకున్న అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేందుకు మరో సమస్య ఎదురవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రమోషన్ల అంశం అందుకు అడ్డంకిగా మారింది. బీసీ గురుకులాల్లోని సిబ్బందికి ఇటీవలనే ప్రమోషన్లు కల్పించినప్పటికీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల సిబ్బందికి 2018 నుంచి ప్రమోషన్లు లేవు. వీరికి కూడా ప్రమోషన్స్ ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ ఇంకా డీపీసీ ఆమోదం లభించలేదు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రమోషన్ల అంశాన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి. తమకు ప్రమోషన్లు ఇవ్వకుండా నూతన అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వొద్దని గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆయా గురుకులాలకు అలాట్ అయిన అభ్యర్థులకు ఇప్పుడు పోస్టింగ్ ఇచ్చేందుకు ఇదొక సమస్యగా మారింది. ప్రస్తుతం అడ్హాక్ పద్ధతిలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించి, ఆపై నూతనంగా అలాటైన అభ్యర్థులకు అదే అడ్హాక్ పద్ధతిలో పోస్టింగ్లు ఇచ్చే అవకాశం ఉన్నదని నిపుణులు చెప్తున్నారు. అందుకు మెమో జారీ చేస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. ఆయా అంశాలపై ఇప్పటివరకు గురుకులాల నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఇటు అభ్యర్థులు, అటు ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
అలాట్మెంట్ పొందనివారిది మరో సమస్య
మహబూబ్నగర్-రంగారెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆయా జిల్లాల పరిధిలోని అభ్యర్థులకు అలాట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు. దివ్యాంగుల కోటా అభ్యర్థుల జాబితా సైతం పెండింగ్లో ఉన్నది. మిగతా జిల్లాల్లో తమతోపాటు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఇప్పటికే అలాట్మెంట్ ఆర్డర్స్ పొందారని, వారికి పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇస్తే తాము సర్వీస్లో జూనియర్లుగా మారిపోతామని మహబూబ్నగర్-రంగారెడ్డి పరిధిలోని అభ్యర్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. భవిష్యత్తులో ఇది ప్రమోషన్లపై కూడా ఇది ప్రభావం చూపుతుందని, దీనిపై ట్రిబ్ అధికారులు స్పందించి, స్పష్టతనివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.