హైదరాబాద్, నవంబర్ 28(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ట్యాంక్బండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన విగ్రహం వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి సిద్ధమవుతుందని మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని వెల్లడించారు. తెలంగాణకే మణిహారంగా నిలువనున్న అంబేద్కర్ స్మృతివనం పనులు సీఎం ఆదేశాలకు అనుగుణంగా ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. మంత్రులు ప్రశాంత్రెడ్డి, కొప్పుల ఈశ్వర్ సోమవారం అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ పనులను పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ట్యాంక్బండ్ వద్ద 11.5 ఎకరాల్లో నిర్మిస్తున్న అంబేద్కర్ స్మృతివనం పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్కు అంబేద్కర్ అంటే ఎంతో గౌరవమని, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు. దేశంలో అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రంలో నెలకొల్పుతామని, స్మృతివనాన్ని తీర్చిదిద్దుతామని 2016 ఏప్రిల్ 14న నిర్వహించిన జయంతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు. విగ్రహం అడుగు భాగంలో పార్లమెంటు తరహా నిర్మాణంతోపాటు స్మృతివనంలో అంబేద్కర్ జీవిత విశేషాలతో కూడిన ఫొటో గ్యాలరీ, ఆయన జీవిత చరిత్రను వివరించేందుకు సినిమా థియేటర్ను కూడా ఏర్పాటుచేస్తామని వివరించారు.