కరీంనగర్ : మహనీయులు డా.బీఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలే, బాబు జగ్జీవన్ రామ్ కన్న కలలను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారనిబీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియంలో హుజరాబాద్ నియోజకవర్గం దళిత బందు లబ్ధిదారులకు వాహనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు వాహనాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహనీయులు అంబేద్కర్, జ్యోతిబా పూలే బాబు, డాక్టర్ జగ్జీవన్ రామ్ దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు.. దళితులు వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలనే సంకల్పంతో ఎన్నో సంస్కరణలు చేపట్టారన్నారు.
ఈరోజు వారి కన్న కలలను మరో మహనీయుడు కేసీఆర్ నిజం చేస్తూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని మంత్రి కొనియాడారు. దళితులు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో దళిత బంధు పథకం ప్రవేశ పెట్టారన్నారు. ఒక్క రూపాయి కూడా బ్యాంకు లింకేజీ లేకుండా 10 లక్షల రూపాయలను నేరుగా వారి అకౌంట్లలో జమ చేస్తున్నామని మంత్రి తెలిపారు.
దళితులు వారు కోరుకున్న రంగాల్లో ఎదిగేందుకు మంచి యూనిట్లను ఎంచుకొని ఆర్థిక సాధికారత సాధించాలన్నారు. కరీంనగర్ నియోజకవర్గం లోని 100 మంది దళిత బంధు లబ్ధిదారులకు దళిత బంధు మంజూరు ప్రొసీడింగ్స్, బ్యాంకు పాస్ బుక్ లను అందజేశామన్నారు.
ఈ సందర్భంగా మంత్రి 19.82 కోట్ల విలువైన 270 వాహనాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, మేయర్ వై సునీల్ రావు, జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సురేష్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ విట్టల్,తదితరులు పాల్గొన్నారు.