హైదరాబాద్, మార్చి13 (నమస్తే తెలంగాణ): కరెన్సీ నోట్లపై డాక్టర్ బీఆర్ అంబేదర్ ఫొటోను ముద్రించాలని కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రాందాస్ అథవాలేను ‘కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి’ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరుశురామ్ కోరారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని విన్నవించారు. పరుశురామ్ ఫిబ్రవరి 1న చేపట్టిన ప్రజా పోరు రథయాత్ర ఇటీవల ఢిల్లీకి చేరింది. ఇందులో భాగంగా సోమవారం ఆయన కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రిని ప్రత్యేకంగా కలిశారు. కరెన్సీపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని కోరుతూ 31న జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న మహా ధర్నాకు ముఖ్యఅతిథిగా హాజరు కావాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.