హైదరాబాద్ : సైబర్ నేరాల నియంత్రణ బాధ్యత సైబర్ అంబాసీడర్లదేనని హోంమంత్రి మహమూద్ ఆలీ అన్నారు. ఉమెన్ సేఫ్టీ వింగ్, తెలంగాణ పోలీస్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో బుధవారం రవీంద్ర భారతీలో నేషనల్ యూత్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సైబర్ అంబాసీడర్ ప్లాట్ ఫామ్ ను, లోగోను ప్రారంభించి మంత్రి మాట్లాడారు.
నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులు ప్రథమ స్థానంలో ఉన్నారని తెలిపారు. సమాజంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని వెల్లడించారు. సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ అంబాసిడర్స్ పాఠశాలల్లో నిరంతరం అవగాహన కల్పిస్తారని తెలిపారు. రాష్ట్రంలో ఉమెన్ సేఫ్టీ కోసం షీ టీమ్స్, భరోసా కేంద్రాలు అద్భుతంగా పని చేస్తున్నాయని ప్రశంసించారు.
డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.సేఫ్టీ అంటే ఫిజికల్ నే కాకుండా డేటా,సెక్యూరిటీ ,సేఫ్టీ లో ముందు ఉండాలని తెలిపారు.సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ సెక్రటరీ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ ప్రతి స్కూల్ నుంచి 4 గురిని సెలెక్ట్ చేసి సైబర్ నేరాలపై ట్రైనింగ్ ఇస్తామని వివరించారు. శిక్షణ పొందిన విద్యార్థులు వారి స్కూల్స్ లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించి, అప్రమత్తం చేస్తారని వెల్లడించారు.