హైదరాబాద్, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ) : తెలంగాణలో తమ అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ (ఏఎఫ్ఈ) కార్యక్రమాన్ని మరింత విస్తరించనున్నట్టు అమెజాన్.ఇన్ ప్రకటించింది. ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్(ఈఐ) భాగస్వామ్యంతో 31 జిల్లాల్లోని 120 ప్రభుత్వ బడుల్లో మొత్తం 40 వేల మంది పిల్లలకు ఈ కార్యక్రమాన్ని చేరువ చేయనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రాథమిక అక్షరాస్యత-సంఖ్యాజ్ఞానాన్ని బలోపేతం చేయడం, కంప్యూటర్ సైన్స్ కాన్సెప్ట్లను పరిచయం చేయడం వంటి రెండు ప్రధాన అంశాలపై ఈ సందర్భంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్టు వివరించింది. విద్యానైపుణ్యాలను పెంపొందించడమే కాకుండా సాంకేతికతలో భవిష్యత్తు కెరీర్ మార్గాలకు బలమైన పునాదిని వేసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఎస్సీ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఈ నవీన్ నికోలస్ పేర్కొన్నారు. నిరుపేద వర్గాల విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ విద్యను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ కార్యక్రమం 2021లో ప్రారంభించిన విషయం తెలిసిందే.