కంది, సెప్టెంబర్ 29: అమెజాన్ ఉత్పత్తులు, ఆన్లైన్ సేవలు వినియోగించుకునే విధానంపై ఐఐటీ విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఐఐటీ హైదరాబాద్లో గురువారం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ నిర్వహించారు. కార్యక్రమంలో అమెజాన్ ఇండియా డైరెక్టర్ కిశోర్ తోట పాల్గొని అమెజాన్ సేవల గురించి వివరించారు. అమెజాన్ ఇండియా వినియోగదారుల కోసం మెటావరల్డ్ ప్రారంభించినట్టు తెలిపారు. ఈ ఫెస్టివల్లో గొప్ప డీల్స్, నగదు ఆదా చేసుకునేలా టాప్ బ్రాండ్ల నుంచి 2 వేల పైచిలుకు కొత్త ఉత్పత్తులను లైవ్లో విడుదల చేశామని చెప్పారు. దేశవ్యాప్తంగా 11 లక్షల మంది విక్రేతలు, 2 లక్షల స్థానిక స్టోర్లతో అమెజాన్ విక్రయాలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు.
గత సంవత్సరంతో పొలిస్తే తెలంగాణలో అమెజాన్ వినియోగదారులకు సేవలు అందిస్తున్న విక్రేతలు 25 శాతం మేర పెరిగినట్టు చెప్పారు. నెలరోజుల పాటు కొనసాగే పండుగ సీజన్లో వినియోగదారులు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా షాపింగ్ చేసే సౌలభ్యం ఉంటుందని వివరించారు. ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తగ్గింపు ఉంటుందని, ఎస్బీఐ వంటి ప్రముఖ బ్యాంకుల నుంచి వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లు ఉంటాయని చెప్పారు. వినియోగదారులు అమెజాన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఐఐటీ అమెజాన్ ఆధ్వర్యంలో మ్యూజిక్ సిస్టం, త్రీడి బైక్ రేస్, త్రీడీ వీడియో గేమ్స్ ఏర్పాటు చేశారు.