న్యూఢిల్లీ, మే 18: భారత్లోని మారుమూల ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన పట్టణ స్థాయి వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు డ్రోన్లు ఇతోధికంగా ఉపయోగపడతాయని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) పేర్కొన్నది. తెలంగాణ ప్రభుత్వంతోపాటు అపోలో దవాఖానల ఆధ్వర్యంలోని హెల్త్నెట్ గ్లోబల్, నీతి ఆయోగ్తో కలిసి ప్రయోగాత్మకంగా నిర్వహించిన ‘మెడిసిన్ ఫ్రం ద స్కై’ కార్యక్రమం ద్వారా సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ డబ్ల్యూఈఎఫ్ బుధవారం ఈ వ్యాఖ్యలు చేసింది. డ్రోన్ల ద్వారా కీలకమైన వ్యాక్సిన్లు, మందులను సరఫరా చేసేందుకు 45 రోజులపాటు చేపట్టిన ఈ కార్యక్రమంలో దాదాపు 3 లక్షల మందికిపైగా జనాభాను కవర్ చేస్తున్న ఎనిమిది హెల్త్కేర్ సెంటర్లు పాల్గొన్నాయి. సుదూర ప్రాంతాలకు వ్యాక్సిన్లను పంపేందుకు ఆసియా ఖండంలో చేపట్టిన ప్రయోగాల్లో విజయవంతమైన తొలి ప్రయోగం ఇదేనని డబ్ల్యూఈఎఫ్ ప్రశంసించింది. మారుమూల ప్రాంతాల్లో వైద్యపరమైన అత్యవసర పరిస్థితులను అధిగమించేందుకు దేశవ్యాప్తంగా డ్రోన్ టెక్నాలజీ వినియోగాన్ని ఎలా పెంపొందించుకోవచ్చన్న విషయాన్ని ‘మెడిసిన్ ఫ్రం ద స్కై’ స్పష్టం చేస్తున్నదని శ్లాఘించింది. స్విట్జర్లాండ్లోని దావోస్-క్లోస్టర్స్లో ఈ నెల 22 నుంచి 26 వరకు జరుగనున్న వార్షిక సమావేశాలకు ముందు డబ్ల్యూఈఎఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
‘మెడిసిన్ ఫ్రం ద స్కై’లో భాగంగా హెల్త్కేర్ నిపుణులు వికారాబాద్ జిల్లాలోని ఎనిమిది జిల్లా ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్న 3 లక్షల మందికిపైగా ప్రజలకు వ్యాక్సిన్లు, మందులు, ఇతర వైద్య ఉత్పత్తులను పంపిణీ చేశారు. అనంతగిరి హిల్స్ చుట్టూ ఉన్న దట్టమైన అడవుల్లో వివిధ తెగల ప్రజలు నివసిస్తుండటంతో ‘మెడిసిన్ ఫ్రం ద స్కై’ ట్రయల్కు వికారాబాద్ జిల్లాను ఎంచుకొన్నారు. మొత్తం 45 రోజులపాటు సాగిన ఈ ట్రయల్లో డ్రోన్లు 300కుపైగా సార్టీలను నిర్వహించాయి. ఈ ప్రయోగంలో వచ్చిన ఫలితాలను ‘మెడిసిన్ ఫ్రం ద స్కై, ఇండియా: హౌ డ్రోన్స్ కెన్ మేక్ ప్రైమరీ హెల్త్కేర్ యాక్సెసబుల్ టు ఆల్’ పేరిట రూపొందించిన నివేదికలో విశదీకరించారు. మౌలిక వైద్య సదుపాయాలు అందుబాటులో లేని పౌరులకు అత్యవసర ఔషధాలను ఎలా అందజేయాలన్న విషయాన్ని ఈ ఫలితాలు విస్పష్టంగా చెప్తున్నాయని డబ్ల్యూఈఎఫ్ పేర్కొన్నది. మరోవైపు ‘మెడిసిన్ ఫ్రం ద స్కై’ని దేశానికి మార్గనిర్దేశం చేస్తున్న ప్రాజెక్టుగా పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అభివర్ణించారు. డ్రోన్ల రంగానికి ఇప్పటికే అనేక ప్రోత్సాహకాలను ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఇటీవల డ్రోన్ల నిబంధనలను కూడా సడలించిందని, దీంతో దేశంలో డ్రోన్ టెక్నాలజీ మరింత వర్థిల్లుతుందని చెప్పారు.
నాలుగవ పారిశ్రామిక విప్లవానికి తెలంగాణ దిక్సూచి (టార్చ్బేరర్)గా నిలుస్తున్నదని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. వైద్యారోగ్య రంగంలోకి డ్రోన్లను ప్రవేశపెట్టడం ద్వారా మారుమూల ప్రాంతాల ప్రజలను ఏవిధంగా ఆదుకోవచ్చో చెప్పేందుకు ‘మెడిసిన్ ఫ్రం ద స్కై’ ప్రాజెక్టే గొప్ప నిదర్శనమని తెలిపారు. తెలంగాణలో విజయవంతమైన ఈ ప్రాజెక్టును పలు ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకొంటున్నాయని చెప్పారు. డ్రోన్ టెక్నాలజీ సాయంతో ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని ‘మెడిసిన్ ఫ్రం ద స్కై’ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా డబ్ల్యూఈఎఫ్తోపాటు తెలంగాణ, ఇతర రాష్ర్టాల ప్రభుత్వాలతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నామని చెప్పారు.