హిమాయత్నగర్, డిసెంబర్ 1: మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ పోరాటం స్ఫూర్తిదాయకమని శాసనమండలి డిప్యూటీ చైర్మన్, తెలంగాణ మదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్ పేర్కొన్నారు. పోలీస్ కిష్టయ్య 14వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం హిమాయత్నగర్లో ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండా ప్రకాశ్ ముదిరాజ్ మాట్లాడుతూ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉన్నదని చెప్పారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ర్టాన్ని సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సఫలమైందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గత పదేండ్లలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ప్రథమస్థానంలో నిలిచిందని కొనియాడారు. కార్యక్రమంలో తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ ముదిరాజ్, తెలంగాణ మదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బల్ల సత్తయ్య, లీగల్ సెల్ సలహాదారు చంద్రశేఖర్, నాయకులు కనకయ్య, రొయ్యల కృష్ణమూర్తి, చెరుకు సాంబరాజ్ తదితరులు పాల్గొన్నారు.