హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రద్దు చేసిన మెడికల్ సీట్లకు ప్రత్యామ్నాయంగా సీట్లు పెంచాల్సింది జాతీయ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) అని హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రమాణాలకు అనుగుణంగా వసతులు లేవని ఎంఎన్ఆర్, మహవీర్ వైద్య కళాశాలల్లో 450 యూజీ, 100 పీజీ సీట్లను రద్దు చేసిన వివాదం ఎన్ఎంసీ పరిధిలోనే ఉన్నదని తెలిపింది. తుది ఫలితం వెలువడే వరకు వాటిపై ఉత్తర్వులు జారీ చేయొద్దని నివేదించింది. ప్రత్యామ్నాయ సీట్లను పెంచాకే అడ్మిషన్లను అనుమతించాలని కోరింది. రద్దయిన కాలేజీ విద్యార్థులను ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేయటానికి ముందుగా ఎన్ఎంసీ సూపర్ న్యూమరరీ సీట్లను సృష్టించాలని చెప్పింది.
ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో తమ ప్రవేశాలను రద్దు చేసిన ఎన్ఎంసీ ఎలాంటి ప్రత్యామ్నాయం చేయలేదని పీజీ విద్యార్థులు డాక్టర్ మంగమూరి వర్షిణి సహా 48 మంది హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అఫిడవిట్లో ‘రద్దు వల్ల నష్టపోయే విద్యార్థులను ఇతర కాలేజీల్లో ఏవిధంగా సర్దుబాటు చేస్తారో, సర్దుబాటు చేసే కాలేజీల్లోని వసతులు, ప్రస్తుత సీట్లు, వాటి పెంపు వంటి అంశాలపై ఎన్ఎంసీ నిర్ణయం తీసుకోవాలి’ అని వివరించింది. సీట్ల రద్దు నేపథ్యంలో మే 19న రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందని, ఆ కమిటీ సిఫారసులను అమలు చేసేలా ఎంఎన్సీకి ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. తదుపరి విచారణను హైకోర్టు జూలై 7కు వాయిదా వేసింది.