గోవిందా.. గోవిందా.. అంటూ భక్తుల విష్ణు నామస్మరణతో ఆలయాలు మార్మోగిపోయాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శనివారం తెల్లవారుజాము నుంచే భక్తులు వైష్ణవాలయాలకు బారులుతీరారు.
ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి స్వామివారిని దర్శించుకొని తరించారు. రాష్ట్రంలోని ప్రధానాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
అర్చకులు ముక్కోటి ఏకాదశి విశిష్టతను వివరించారు. తిరుమలతోపాటు రాష్ట్రంలోని భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి, యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహస్వామి, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజన్న ఆలయం, జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి ఆలయాలతోపాటు రాష్ట్రంలోని అన్ని క్షేత్రాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ కనిపించింది.