నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూన్ 22 (నమస్తే తెలంగాణ): సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాంరెడ్డి సోదరులతోపాటు 20మంది సోమవారం కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో ఏ11గా ఉన్న అల్లు అర్జున్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొన్నారు. అల్లు అర్జున్ తరఫున న్యాయవాది అశోక్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో కోర్టు అనుమతినివ్వడంతో న్యాయవాది అశోక్రెడ్డి అల్లు అర్జున్కు వీడియో కాల్ చేసి మెజిస్ట్రేట్కు అందించారు. తదుపరి విచారణ జూలై 6కు వాయిదా పడిందని అల్లు అర్జున్కు జడ్జి సూచించారు. వచ్చే వాయిదాకు కమిటల్ బాండ్ (జిల్లా కోర్టుకు కేసు బదిలీ) సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కేసులో ఉన్న 23 మంది తరఫున న్యాయవాదులు వకాల్తా దాఖలు చేయగా కోర్టు అంగీకరించింది. పీఆర్సీ 264 ఆఫ్ 2026 నంబరు గల ఈ కేసు జిల్లా కోర్టుకు బదిలీ కానున్నది.