అబిడ్స్, డిసెంబర్13 : 2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల మంజూరుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడం పట్ల టీఎస్ఎంఎఫ్సీ చైర్మన్ ఇంతియాజ్ హర్షం వ్యక్తం చేశారు. దాంతో ఆయన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నాంపల్లిలోని హజ్భవన్లోని కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అందించే రుణాలకు దరఖాస్తు తేదీలను, ఇతర వివరాలను ఈ నెల 16న వెల్లడిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఈ ఏడాది 5 వేల మంది మైనారిటీ అభ్యర్థులకు బ్యాంక్ సబ్సిడీ రుణాలివ్వనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం రూ.50 కోట్ల వ్యయంతో నిరుద్యోగులకు ఆర్థిక సాయం చేయనున్నట్టు పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారని కొనియాడారు.