హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్ కోర్ బ్రాంచీలకు బోధిస్తున్న ఫ్యాకల్టీని ఇతర బ్రాంచీల బోధనకు అనుమతించాలని జేఎన్టీయూహెచ్ను అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆదేశించింది. సివిల్, మెకానికల్, ఈఈఈ, ఈసీఈ వంటి కోర్ బ్రాంచీలకు బోధించే ఫ్యాకల్టీని అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్చైన్, రోబోటిక్స్, క్వాంటం కంప్యూటింగ్, డాటా సైన్సెస్, సైబర్ సెక్యూరిటీ, 3డీ ప్రింటింగ్, డిజైన్ వంటి కోర్సుల్లో బోధించేందుకు అనుమతించాలని ఆదేశాలిచ్చింది.
ఈ మేరకు జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డికి ఏఐసీటీఈ సలహాదారు మమతా అగర్వాల్ లేఖ రాశారు. ఆయా కోర్సులకు బోధించాలంటే ఫ్యాకల్టీ.. స్వయం, ఎన్పీటీఎల్, మూక్స్ ద్వారా 10 క్రెడిట్స్ సొంతం చేసుకొని ఉండాలని సూచించారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీటీఐఈఏ) అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి స్వాగతించారు. దీని ద్వారా ఫ్యాకల్టీ కొరత తీరుతుందని, ఏఐసీటీఈ ఆదేశాలను జేఎన్టీయూ తూచా తప్పకుండా పాటించాలని కోరారు.