హైదరాబాద్ మే 24 (నమస్తే తెలంగాణ), బేగంపేట్: ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించే వాహనదారులకు తప్పనిసరిగా సంబంధిత రాష్ర్టాల అధికారులు జారీ చేసిన ఈ-పాస్ లేదా తత్సమాన పాస్లుంటేనే అనుమతిస్తామని డీజీపీ మహేందర్రెడ్డి స్పష్టంచేశారు. అయితే, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే అంబులెన్స్లు, ఇతర వాహనాలను ఆంక్షలు లేకుండానే యథావిధిగా అనుమతిస్తున్నామని తెలిపారు. వివిధ రాష్ర్టాల నుంచి తెలంగాణకు వచ్చే అన్ని వాహనాలను ఆయా రాష్ర్టాల సరిహద్దుల్లో నిలిపివేస్తున్నారన్న వార్తలపై డీజీపీ మహేందర్రెడ్డి వివరణ ఇచ్చారు. మెడికల్ ఎమర్జెన్సీతోపాటు సంబంధిత రాష్ర్టాలు జారీ చేసిన ఈ-పాస్లు ఉండే వాహనదారులను అనుమతిస్తామని తెలిపారు. జాతీయ రహదారులపై అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ వాహనాలను అనుమతిస్తున్నామని స్పష్టం చేశారు.
లాక్డౌన్ సమయంలో రోడ్లమీదికి వచ్చే వాహనాలను కచ్చితంగా తనిఖీచేయాలని డీజీపీ మహేందర్రెడ్డి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూలు, ప్యారడైజ్ ప్లాజా సెంటర్ల్లో చెక్పోస్టుల వద్ద వాహనాల తనిఖీని పరిశీలించిన ఆయన.. స్థానిక పోలీసులకు పలు సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో అనుమతి ఉన్నవారిని వదిలిపెట్టాలని చెప్పారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని నాగోల్ చెక్పోస్ట్ను కూడా డీజీపీ ఆకస్మిక తనిఖీ చేశారు. సీపీ మహేశ్భగవత్తో కలిసి లాక్డౌన్ అమలును పరిశీలించారు. మూడు రోజుల వ్యవధిలో డీజీపీ క్షేత్రస్థాయిలో పరిశీలించటం ఇది రెండోసారి. అటు..లాక్డౌన్ను కఠినంగా అమలు చేసేందుకు పోలీసులు మండుటెండను కూడా లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారు.