హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్లోనూ విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ కోర్సుకే జైకొట్టారు. ఈ కోర్సులో మొదటి, రెండో విడత కలిపి మొత్తం 48,422 సీట్లుంటే 45,731 సీట్లు భర్తీ అయ్యాయి. ఆదివారం ఎంసెట్ రెండో విడత సీట్లను సాంకేతిక విద్యాశాఖ అధికారులు కేటాయించారు. అన్ని కోర్సుల్లో కలిపి మొత్తం 21,136 సీట్లు భర్తీ చేశారు. కోర్సుల వారీగా భర్తీ చూసినట్టయితే.. కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ తత్సంబంధ కోర్సులో 94.44శాతం సీట్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ బ్రాంచిల్లో 77.5 5శాతం సీట్లు, ఇతర ఇంజినీరింగ్ బ్రాంచిల్లో 46.26 సీట్ల చొప్పున మొత్తం 81.87శాతం సీట్లను నింపారు. సివిల్, మెకానికల్ బ్రాంచిల్లో భారీగా సీట్లు మిగిలాయి. ఈ కోర్సుల్లో 33.97శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 66 శాతానికి పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయి. యాజమాన్యాల వారీగా తీసుకొంటే ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో 82.19శాతం సీట్లు, యూనివర్సిటీల్లో 79.17శాతం సీట్లు, ప్రైవేట్ యూనివర్సిటీల్లో 74.93శాతం సీట్లను నింపారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 18లోపు ట్యూషన్ ఫీజు చెల్లించి సీట్లు దక్కించుకోవాలని అధికారులు సూచించారు.