హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బీజేపీలో కూటముల కొట్లాట మరింత ముదురుతున్నది. ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా కొందరు నేతలు జట్టు కట్టినట్టు తెలుస్తున్నది. కొన్ని నెలలుగా వారు ఈటల పనితీరు, వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా బండి సంజయ్కి వ్యతిరేకంగా పదే పదే ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ సమయంలోనే ఓ మాజీ ఎంపీ ఇంట్లో వారంతా ప్రత్యేకంగా సమావేశమై ఈ అంశంపై చర్చించుకున్నారు.
అధ్యక్షుడిని మార్చడంతో వారిలో అసంతృప్తి ఇంకా పెరిగిందని సమాచారం. పైగా ఈటల చేరికల కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నా.. చేసిందేమీ లేదనే విమర్శలు ఉన్నాయి. పేరు గొప్ప ఊరు దిబ్బగా ఆయన పనితీరు ఉన్నదని వారు గతంలోనే ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. కొత్త అధ్యక్షుడు కిషన్రెడ్డితోనూ ఈటల విభేదిస్తుండటం, ఆయన కార్యక్రమాల్లో పాల్గొనకుండా ధిక్కార స్వరం వినిపిస్తుండటంపై ఈ వర్గం మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. 24 గంటల దీక్షకు సైతం డుమ్మా కొట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. తాజా గా ఓ గెస్ట్హౌస్లో ముఖ్య నేతలు భేటీ అయినట్టు తెలుస్తున్నది. ఈటల వ్యవహారంపై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.