హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జర్నలిస్టులతో తనది ఉద్యమ సంబంధమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో తెలంగాణ జర్నలిస్టుల కృషిని గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి రూ.100 కోట్ల నిధిని ఏర్పాటుచేసిందని తెలిపారు. బీఆర్ఎస్ ఏర్పాటు సందర్భంగా అభినందనలు తెలిపేందుకు ఢిల్లీకి వచ్చిన తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఇతర జర్నలిస్టు సంఘాల నేతలతో కేసీఆర్ శుక్రవారం మరోసారి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మీడియా అకాడమీ ద్వారా జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటూ వస్తున్నదని చెప్పారు. అక్రిడిటేషన్లు సహా జర్నలిస్టులకు అందాల్సిన అన్ని ప్రత్యేక సౌకర్యాలను అందిస్తున్నదని పేర్కొన్నారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే పరిస్థితులను బట్టి చర్చించి పరిషరించుకుందామని భరోసా ఇచ్చారు. త్వరలో నిర్వహించనున్న ఇండియన్ జర్నలిస్టుల యూనియన్(ఐజేయూ) జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా కేసీఆర్ను ఆహ్వానించగా సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టులకు సంబంధించిన విషయాలపై సమన్వయం చేయాలని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ను ఆదేశించారు. సీఎంను కలిసినవారిలో అసాని మారుతీసాగర్, అవ్వారి భాసర్ తదితరులు ఉన్నారు.