హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రేషన్ పంపిణీతోపాటు ఆరోగ్య తదితర సంక్షేమ పథకాలన్నింటినీ ఒకే కార్డు ద్వారా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందుకోసం అన్ని కుటుంబాలకు డిజిటల్ కార్డులు ఇవ్వాలని యోచిస్తున్నది. ఈ అంశంపై సీఎం రేవంత్రెడ్డి సోమవారం తన నివాసంలో వైద్యారోగ్య, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజస్థాన్, హర్యానా, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటి కార్డులు ఇచ్చినందున వాటివల్ల కలుగుతున్న లాభనష్టాలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. ప్రయోగాత్మకంగా తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణాన్ని, ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఫ్యామిలీ డిజిటల్ కార్డులను అందించేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులకు స్పష్టం చేశారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఉండాలని, వాటితో లబ్ధిదారులు ఎకడైనా రేషన్, ఆరోగ్య సేవలు పొందేలా వీలుకల్పించాలని సూచించారు. దీర్ఘ కాలంలో వైద్యసేవలకు ఉపయోగపడేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రతి కుటుంబ సభ్యుని హెల్త్ ప్రొఫైల్ ఉండాలని పేర్కొన్నారు. కుటుంబసభ్యుల వివరాల్లో మార్పులు, చేర్పుల కోసం ఈ కార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని తెలిపారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పర్యవేక్షణకు జిల్లాలవారీగా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర రాజనరసింహ, సీఎస్ శాంతికుమారి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి, కార్యదర్శులు చంద్రశేఖర్రెడ్డి, సంగీత సత్యనారాయణ, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టియానా జడ్ చోంగ్తూ పాల్గొన్నారు.