హైదరాబాద్ : కొవిడ్ పరిస్థితులను అధిగమించేందుకు అధికారులంతా అంకితభావంతో పనిచేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో బీఆర్కే భవన్లో సోమవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
మున్సిపల్ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లతో కూడిన బృందాలను ప్రతి ఇంటికి పంపించాలని, జ్వరం, ఇతర లక్షణాలతో బాధపడుతున్నవారిని గుర్తించి మెడికల్ కిట్లను అందజేయాలని ఆదేశించారు.
అన్ని పీహెచ్సీలు, బస్తీ దవాఖానాలు, ఇతర ఆరోగ్య కేంద్రాలలో కొవిడ్ అవుట్ పేషెంట్ క్లీనిక్లను నిర్వహించాలన్నారు.
నిమ్స్ ఆసుపత్రి, సరోజిని దేవి, ఛాతీ, గాంధీ, ఫివర్, టిమ్స్, కింగ్ కోఠి, మలక్ పేట, గోల్కొండ, వనస్థలిపురం, కొండపూర్ ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ పడకల సంఖ్యను పెంచాలని అధికారులను ఆదేశించారు.
అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానల్లో పారిశుధ్య డ్రైవ్ చేపట్టాలన్నారు.
సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, మున్సిపల్ పరిపాలన కమిషనర్, డైరెక్టర్ ఎన్ సత్యనారాయణ, ఆర్ధికశాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రాస్, ఇంటర్మీడియెట్ విద్యా కార్యదర్శి ఒమర్ జలీల్, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాస రాజు, టీఎస్ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ నరసింహా రెడ్డి పాల్గొన్నారు.