హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు బీజేపీ ఉచ్చులో పడొద్దని, తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకొంటున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తున్నదని, రాష్ర్టానికి రావాల్సిన రూ.1100 కోట్లను ఇప్పటివరకు విడుదల చేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. రోడ్లపై గుంతలు ఉండొద్దని, రవాణాకు ఆటంకాలు లేకుండా చూడాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మంత్రి ఎర్రబెల్లి శనివారం రంగారెడ్డి జడ్పీ కార్యాలయంలో అన్ని జిల్లాల పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజినీర్లతో సమావేశమయ్యారు. అనంతరం కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీపీవోలు, డీఆర్డీవో, ఎంపీవోలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ రహదారులు అద్దంలా ఉండాలని, దెబ్బతిన్న చోట్ల వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
రైతు కల్లాల కోసం ప్రభుత్వం రూ.151 కోట్లు ఖర్చు చేయడాన్ని కేంద్రం తప్పుగా భావించి, రూ.1,100 కోట్లు నిలిపివేసిందని.. అధికారులు, సర్పంచులు అర్థం చేసుకోవాలని సూచించారు. కొందరు సర్పంచులు బీజేపీ ట్రాప్లో పడి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ వంటి ముఖ్య పథకాల లబ్ధిదారులు, ప్రతినెలా వచ్చే మొత్తం తదితర వివరాలతో ప్రతి గ్రామంలో బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పంచాయతీ భవనాల నిర్మాణం వేగవంతం చేయాలని, నూతన రహదారుల ప్రతిపాదనల జాబితాను వెంటనే పంపాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, పీఆర్ ఈఎన్సీ సంజీవరావు, కమిషనర్ హనుమంతరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.