నిజామాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా బాధితుల కోసం ప్రభుత్వ దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్టు రోడ్డు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. కొవిడ్ బాధితులకు సరిపడా ఆక్సిజన్, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లా అధికారులతో మంత్రి వేర్వేరుగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దవాఖానలకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. కరోనా మహమ్మారి కట్టడి కోసమే ప్రభుత్వం లాక్డైన్ విధించిందని, దానిని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. కరోనా పాజిటివ్ రేటు 27 శాతం నుంచి 15 శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు. ఆరోగ్యశాఖలో అత్యవసరంగా స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సిబ్బంది నియామకానికి కాంటాక్టు పద్ధతిలో నియమించుకునేందుకు అనుమతులు ఇచ్చినట్లు వివరించారు.