న్యూఢిల్లీ : కరోనా మూడో దశ ఉధృతి పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న అభిప్రాయాలు వాస్తవం కాకపోవచ్చని లాన్సెట్ అధ్యయనం పేర్కొంది. భారత్లో పిల్లలకు కొవిడ్ ముప్పు పేరుతో ది లాన్సెట్ కొవిడ్-19 కమిషన్, ఇండియన్ టాస్క్ఫోర్స్లో భాగంగా పిల్లల వైద్య నిపుణులు నివేదికను రూపొందించారు. థర్డ్ వేవ్లో కేవలం పిల్లలకే అధిక ముప్పు ఉంటుందన్నది సరికాదని నిపుణులు పేర్కొన్నారు. అందరిలాగే వారికి ప్రమాదం ఉంటుందని అభిప్రాయపడ్డారు. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్సీఆర్లోని పది ఆసుపత్రుల్లో చికిత్స పొందిన చిన్నారులపై అధ్యయనం సాగింది.
2,600 మంది చిన్నారుల చికిత్సలను అధ్యయనం చేసిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ఎయిమ్స్కు చెందిన ముగ్గురు పిల్లల వైద్య నిపుణులతో అధ్యయనం నివేదిక తయారు చేశారు. చాలా మంది పిల్లల్లో కరోనా లక్షణాలు కనిపించకపోవచ్చని.. కనిపించినప్పటికీ తేలిక పాటి, లేదంటే మితంగా ఉండొచ్చన్నారు. వైద్యుల సలహాతోనే ఇంట్లోనే చికిత్స అందివచ్చని పేర్కొన్నారు. అయితే, ఎక్కువ మంది చిన్నారులు, జ్వరం, శ్వాస సమస్యలు, విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి వంటి ఇబ్బందులు పడే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది.
మరో వైపు కరోనా సోకి ఆసుపత్రుల్లో చేరిన చిన్నారుల్లో 2.4శాతం మరణాలు సంభవించాయని నిపుణులు తెలిపారు. 9శాతం మందే తీవ్రమైన లక్షణాలతో బాధపడినట్లు పేర్కొన్నారు. డయాబెటిస్, క్యాన్సర్, రక్తహీనత, పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితి దిగజారుతోందని అధ్యయనం పేర్కొంది. సాధారణంగా ఆరోగ్యకరమైన పిల్లలలో కరోనాతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం చాలా తక్కువని తెలిపింది.
భారీగా తగ్గిన పిలల్ల టీకాల పంపిణీ
కరోనా సెకండ్ వేవ్ సమయంలో పిల్లల సాధారణ రోగనిరోధకత గణనీయంగా తగ్గడంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంవత్సరం లోపు 20-22లక్షల మంది పిల్లలకు ప్రతి నెలా జాతీయ కార్యక్రమాల మేరకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. సంవత్సరానికి 260లక్షల మంది పిల్లలకు విస్తరించాల్సి ఉందని ఓ అధికారి తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో పిల్లలకు టీకాల షెడ్యూల్ భారీగా ప్రభావితమైంది. డీటీపీ, న్యుమోకాకల్, రోటా వైరస్, ఎంఎంఆర్ వ్యాక్సిన్లు చాలా మంది పిల్లలకు వేయలేదు. కరోనా సంక్రమణ సమయంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను టీకా కేంద్రాలకు తీసుకువచ్చేందుకు భయపడ్డారని ఆరోగ్య సంరక్షణ సిబ్బంది పేర్కొంటున్నారు.
సాధారణ రోగనిరోధకతలో 60 శాతం తగ్గుదల
కరోనా రెండో వేవ్లో సాధారణ రోగనిరోధకతలో 60 శాతం తగ్గుదల చూశామని, ఇది గత సంవత్సరం క్షీణత రేటు కంటే ఎక్కువగా ఉందని కొలంబియా ఆసియా ఆసుపత్రి పిల్లల వైద్యుడు సుమిత్ గుప్తా అన్నారు. దీనికి కారణం, కరోనా కాలంలో చాలా మంది ఆసుపత్రులను వచ్చేందుకు భయపడడంతో పాటు లాక్డౌన్ కారణంగా ప్రయాణ సదుపాయాలు లేక కొందరికి టీకాలు తప్పిపోయారన్నారు. టీకాలు వేసేందుకు నెల నుంచి రెండు నెలలు ఆలస్యం కావచ్చన్నారు. సరైన సమయంలో పిల్లలకు సరైన రోగనిరోధక శక్తి కోసం షెడ్యూల్ ప్రకారం తప్పనిసరిగా టీకాలు వేయాలని సూచించారు.