Congress | ప్రస్తుత విషయానికి వస్తే రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలందరూ ఎవరికి వారే సీఎం అభ్యర్థులుగా ప్రకటించుకుంటున్నారు. ఈ జాబితాలో జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, మధుయాష్కీగౌడ్.. చెప్పుకుంటూ పోతే చాలామంది ఆ రేసులో ఉన్నారు. సీఎం పదవి తనను వెతుక్కుంటూ వస్తుందంటారు జానారెడ్డి. ఎప్పటికైనా తానే సీఎంనని అంటారు కోమటిరెడ్డి. రేవంత్ అయితే తానే సీఎంనని చెప్పుకొని తిరుగుతున్నారు. వచ్చే పదేండ్లలో తానే సీఎం అని ప్రకటించుకున్నారు జగ్గారెడ్డి. వీరి ప్రకటనలు చూసి తెలంగాణ ప్రజలు విస్తుపోతున్నారు. ఖర్మకాలి కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే సీఎం సీటు కోసం తన్నుకోవడం ఖాయమని చెబుతున్నారు.
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్.. దేశంలో ఎవరికీ అర్థంకాని బ్రహ్మపదార్థం ఏదైనా ఉందంటే అది ఈ పార్టీనే. నిత్యం గందరగోళం.. అయోమయం. ఆ పార్టీ గెలిచిన రాష్ర్టాల్లో ఎప్పుడు ఎవరు సీఎంగా ఉంటారో తెలియదు. ఈ రోజున్న వారు రేపు ఉండకపోవచ్చు. రేపున్నవారు ఎల్లుండి పార్టీలోనే లేకుండా పోవచ్చు. ఐదేండ్లలో ఎంతమంది సీఎంలుగా ఉంటారో తెలియదు. ఇక, అంతర్గత కుమ్ములాటలు, లాబీయింగ్లు, క్యాంపులు, కుట్రలు, కుతంత్రాలు.. ఇలాంటివన్నీ కాంగ్రెస్లో సర్వసాధారణ విషయాలు. వీటిన్నంటికంటే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పార్టీలో అందరూ సీఎం అభ్యర్థులే. ప్రజలిచ్చిన అధికారం మొత్తం కుర్చీని కాపాడుకునేందుకే సరిపోతే ఇక అభివృద్ధి ఊసుక్కెడ? ప్రజల కష్టాలు పట్టేదెప్పుడు? అందుకనే కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు అభివృద్ధిలో అట్టడుగున ఉంటాయనేది రాజకీయ విశ్లేషకుల మాట. అటు రాజస్థాన్ కానీ, ఇటు కర్ణాటక కానీ కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉన్నా ఇదే తీరు. రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య పోరు నడిస్తే.. కర్ణాటకలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య జరుగుతున్న పోరును ఆ రాష్ట్ర ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1956 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ దాదాపు 40 ఏండ్ల పాటు అధికారంలో ఉంది. అంటే ఈ 4 దశాబ్దాల్లో ఐదేండ్లకు ఒకరు చొప్పున 8 మంది సీఎంలు ఉండాలి. కానీ 16 మంది ముఖ్యమంత్రులుగా అధికారం చెలాయించారు. సీఎంలను కాంగ్రెస్ ఎడాపెడా మారుస్తుందని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలేమో. 1978 ఎన్నికల తర్వాత ఏకంగా నలుగురు సీఎంలను మార్చింది. వీరిలో మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రామిరెడ్డి, కోట్ల విజయభాస్కర్రెడ్డి ఉన్నారు. వీరిలో కోట్ల అత్యంత దారుణంగా మూడు నెలలు (111 రోజులు) మాత్రమే సీఎంగా ఉన్నారు. 40 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఇద్దరు మాత్రమే పూర్తిస్థాయి సీఎంలుగా పనిచేశారు. 1964 ఎన్నికల తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి ఏడేండ్లు సీఎంగా పని చేయగా, 2004 తర్వాత వైఎస్ రాజశేఖర్రెడ్డి ఐదేండ్లకు పైగా సీఎంగా పని చేశారు. వీరిద్దరు మినహా మిగిలిన వారంతా ఏడాది, రెండేండ్లు సీఎంగా ఉండి కుర్చీని విడిచిపెట్టినవారే.
కుమ్ములాటలకు కాంగ్రెస్ పెట్టింది పేరు. దీనికి కాంగ్రెస్ పెట్టుకున్న పేరు అంతర్గత ప్రజాస్వామ్యం. సీఎం కుర్చీకోసం ఆ పార్టీలో జరిగే కుమ్ములాటలు మరే పార్టీలోనూ ఉండవు. కాంగ్రెస్ సీఎంలు అభివృద్ధి కంటే కూడా కుర్చీని కాపాడుకునేందుకే ఎక్కువ శ్రమిస్తుంటారని చెబుతుంటారు. కుమ్ములాటలు మరీ ఎక్కువైనప్పుడు మాత్రం అధిష్ఠానం రంగంలోకి దిగి వెంటనే సీఎంను మార్చేసి అప్పటికి పరిస్థితిని చల్లబరుస్తుంది. ఆ తర్వాత మళ్లీ మామూలే. పాలనపై పెను ప్రభావం కుర్చీలో కుదురుకుని ఇక పాలనపై దృష్టి పెట్టే సమయానికి సీఎంల మార్పు వల్ల అభివృద్ధి అటకెక్కుతున్నది. సీఎంలు మారినప్పుడల్లా ప్రాధాన్యాలు కూడా మారుతుండడం వల్ల ఆ పార్టీ ప్రకటించిన ఏ పథకమూ ముందుకు సాగిన దాఖలాలు లేవు. అందుకనే 40 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కునారిల్లింది. కాంగ్రెస్ పాలిత మిగతా రాష్ర్టాల్లోనూ అదే పరిస్థితి