హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): బస్సులో డ్రైవర్ నిద్రమత్తులోకి జారాడా? అలసటతో కాస్త ఎక్కువసేపు కండ్లు మూశాడా? అయితే ఇంకేముందు ‘కుయ్కుయ్’మంటూ అలారం మోగుతుంది. క్షణాల్లో డ్రైవర్లను అప్రమత్తం చేస్తుందీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డివైజ్. దూర ప్రయాణాలు చేసే బస్సు ప్రమాదాల నివారణపై టీఎస్ ఆర్టీసీ దృష్టిపెట్టింది. ఇందుకోసం ఏఐ డివైజ్ను వినియోగించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. స్టీరింగ్కు ఏర్పాటుచేసే ఈ పరికరం డ్రైవర్ కదలికలపై ‘కన్నే’సి ఉంచుతుంది. నిద్రమత్తులోకి జారినా, అలసటతో ఎక్కువసేపు కన్నుమూసినా వెంటనే అప్రమత్తం చేస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ డివైజ్ను రూపొందించిన మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంసీఈఎంఈ).. దీని తయారీ, పనితీరుపై ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఐటీ విభాగం ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన సమావేశంలో చర్చించారు.
రాష్ట్రం నుంచి పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా పలు రాష్ర్టాలకు టీఎస్ఆర్టీసీ నిత్యం బస్సులను నడుపుతున్నది. ఈ బస్సులు ప్రమాదాలకు గురైన సందర్భాల్లో కారణాలను విశ్లేషిస్తే చాలావరకు డ్రైవర్ నిద్రమత్తు, అలసటగా తేలుతున్నది. ఎంసీఈఎంఈ రూపొందించిన డివైజ్ ప్రమాదాల నివారణకు ఉపయోగపడుతుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా కొన్ని బస్సుల్లో వీటిని ఏర్పాటుచేయనున్నారు. నెలపాటు పరీక్షించిన తర్వాత ఫలితాలను బట్టి మిగిలిన వాటిలోనూ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నట్టు అధికారులు చెప్తున్నారు