హైదరాబాద్, జూన్ 28: బిలియనీర్ వాణిజ్యవేత్త ముకేశ్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని వారసులకు అప్పగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 217 బిలియన్ డాలర్ల రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) గ్రూప్ టెలికం సంస్థ రిలయన్స్ జియో బోర్డ్కు రాజీనామా చేసి, ఆ సంస్థ బాధ్యతల్ని తన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి అప్పగించారు. ఈ మేరకు మంగళవారం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ స్టాక్ ఎక్సేంజీలకు సమాచారం అందించింది.
ప్రస్తుత నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన ఆకాశ్ ఎం అంబానీని కంపెనీ డైరెక్టర్ల బోర్డ్కు చైర్మన్గా నియమించాలన్న ప్రతిపాదనను జూన్ 27న సమావేశమైన బోర్డ్ ఆమోదించిందని ఎక్సేంజీలకు తెలిపింది. అలాగే తండ్రి ముకేశ్ ఇదే తేదీన రాజీనామా చేశారు. అలాగే జియో ఇన్ఫోకామ్కు ఐదేండ్ల కాలానికి మేనేజింగ్ డైరెక్టర్గా పంకజ్ మోహన్ పవార్ను బోర్డ్ నియమించినట్టు కంపెనీ వెల్లడించింది. కేంద్ర మాజీ ఆర్థిక కార్యదర్శి రామిందర్ సింగ్ గుజ్రాల్, మాజీ సీవీసీ కేవీ చౌదరిలను ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా నియమించారు. ఇప్పటికే వీరువురూ ఆర్ఐఎల్ బోర్డ్లో సభ్యులు. జియో మాతృసంస్థ అయిన ఆర్ఐఎల్..ఆయిల్ రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ నుంచి రిటైల్, మీడియా, న్యూఎనర్జీ వ్యాపారాల్లో విస్తరించిఉంది.
ఇషాకు రిటైల్ వ్యాపారం?
కుమార్తె ఇషాకు రిటైల్ వ్యాపారాన్ని అప్పగిస్తారన్న అంచనాలు మార్కెట్లో ఉన్నాయి. పిరమల్ గ్రూప్ అధినేత అజయ్ పిరమల్ కుమారుడు ఆనంద్తో ఇషా వివాహం జరిగింది. ఫుడ్, గ్రాసరీ, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, జ్యువెలరీ, ఫుట్వేర్, క్లోథింగ్ తదితర విభాగాల్లో సూపర్ మార్కెట్లు, ఆన్లైన్ రిటైల్ వెంచర్ జియోమార్ట్లను నిర్వహిస్తున్న రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) బోర్డ్లోనూ, డిజిటల్ సంస్థ అయిన జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ బోర్డ్లోనూ 2014 నుంచి ఆకాశ్, ఇషాలు డైరెక్టర్లుగా ఉన్నారు. ఆర్ఆర్బీఎల్ బోర్డ్లో ఇటీవలే అనంత్ డైరెక్టర్గా చేరారు.