హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందాలని కోరుకుంటూ టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు రాజస్థాన్ రాష్ట్రం ఆజ్మీర్ దర్గాలో హైదరాబాద్ ముస్లిం మత పెద్దలు అందజేసిన చాదర్ ను సమర్పించారు. ఈ మేరకు ఆదివారం ఆర్టీఐ కమిషనర్ అమీర్తో కలిసి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) దేశవ్యాప్తంగా విశేష ప్రజాదరణ పొందాలని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు.
బీఆర్ఎస్ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బలోపేతమై రాజకీయంగా కేసీఆర్ ఆశయం, ఆకాంక్షలు వందశాతం ఫలించాలని అల్లాను వేడుకున్నారు. కేసీఆర్కు ఆయురారోగ్యాలు, శక్తియుక్తులు ఇవ్వాలని టీఆర్ఎస్ నాయకులు మీర్పేట్ కార్పొరేటర్ ఎం.పవన్, సీక చంద్రశేఖర్, సమీ భాయ్, ముతహర్ షరీఫ్, ముస్లీం మత పెద్దలు ప్రార్థనలు చేశారు.
ప్రగతిశీల ఐక్య భారత్ కోసమే కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటు చేశారని బాలమల్లు అన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలు, ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడంలో గత పాలకులు విఫలం కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చారని వెల్లడించారు. భారతదేశంలో ఉన్న అపార సహజ వనరులు, భౌగోళిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ కు సమగ్ర అవగాహన, రాజకీయ, పాలనాపరమైన విశేషానుభవం ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో దేశం అన్నిరంగాల్లో పురోగతి సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు.