హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : కో లివింగ్ హాస్టళ్ల పేరుతో యువత జీవితాలతో చెలగాటమాడొద్దని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలోని ఎలైట్ కో-లివింగ్ హాస్టల్లో దుర్గ అనే యువతి శనివారం హాస్టల్ భవనంపై నుంచి దూకి చనిపోయింది. ఆదివారం ధర్మేంద్ర ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఆయన మాట్లాడుతూ దుర్గ ఆత్మహత్యకు సాయికుమార్ అనే తోటి లివింగ్మేట్ కారణమని.. ఇద్దరి మధ్య వ్యక్తిగత విషయాలపై వాగ్వాదం జరుగడంతో దుర్గ ఆత్మహత్య చేసుకున్నదని తెలిపారు. హైదరాబాద్ నగరంలో 11వేలకు పైగా కో-లివింగ్ హాస్టళ్లు ఉన్నాయని తెలిపారు. దుర్గకు న్యాయం చేయాలని, వ్యక్తిగత కోణంలోనే కాకుండా హాస్టల్ నిర్వహణ, యాజమాన్య బాధ్యతలు తదితర అన్ని అంశాలపై సమగ్ర విచారణ జరుపాలని ధర్మేంద్ర డిమాండ్ చేశారు.