ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జీత్కౌర్
హైదరాబాద్, ఫిబ్రవరి 7, కాచిగూడ: కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా మిషన్ 2024 పేరుతో దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తామని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్కౌర్ తెలిపారు. ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో శ్రామికులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ కాచిగూడలో నిర్వహిస్తున్న ఏఐటీయూసీ మూడ్రోజుల జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా అమర్జీత్కౌర్ మాట్లాడుతూ.. రైతు ఉద్యమ స్ఫూర్తితో మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహిస్తామని చెప్పారు. మోదీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ రాజ్యాంగంపై దాడికి పాల్పడుతున్నదని, పార్లమెంటరీ, ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తున్నదని విమర్శించారు. ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ పేరుతో మౌలిక వసతులను కల్పించే రంగాలను అమ్మకానికి పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.