జలియన్వాలాబాగ్లో మారణకాండ సాగించిన మరుసటి రోజే బ్రిటిష్ పాలకులు అంతకుమించిన దాడి పంజాబ్లోని గుజ్రన్వాలాలో జరిపారు. నిరసనలు తెలుపుతున్న సామాన్యపౌరులపై ఏకంగా విమానాలతో బాంబుదాడులు చేశారు.
1919 అనగానే అమృత్సర్లో జరిగిన జలియన్వాలా బాగ్ మారణకాండ గుర్తుకువస్తుంది. వందలాది మంది అమాయకులు తూటాలకు ఎరగా మారిన నరమేధం అది. నిరాయుధులైన అమాయక ప్రజలపై కాల్పులు జరిపించింది సైనికాధికారి రెగినాల్డ్ డయ్యర్. వంత పాడి వత్తాసు పలికింది అప్పటి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ సర్ మైకేల్ ఓడ్వయ్యర్. ఈ ఓడ్వయ్యర్నే 21 ఏండ్ల తర్వాత ఉధంసింగ్ లండన్లో కాల్చి చంపి ఉరికంబమెక్కాడు. ఇదంతా తెలిసిన చరిత్ర. కానీ, అదే 1919లో మరో ఘోరకలికి తెరతీశాడు ఓడ్వయ్యర్. ప్రస్తుతం పాక్ పంజాబ్లో భాగంగా ఉన్న గుజ్రన్వాలాలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అల్లర్లు జరుగుతున్నాయి. ఆ అల్లర్లను అణచివేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపారు. సర్ ఓడ్వయ్యర్ ఆందోళనకారులపైకి ఏకంగా యుద్ధ విమానాలను పంపాడు. బాంబులు వేయించాడు. ‘జలియన్వాలా బాగ్’ జరిగిన మరుసటి రోజే ఇది జరగడం గమనార్హం.
మూడు బీ2సీ యుద్ధ విమానాలను ఈ దాడికి వినియోగించారు. అవి గుజ్రన్వాలా శివార్లలోని దుల్లా గ్రామంపై మూడు 20 పౌండ్ల బాంబులు వేశాయి. గుజ్రన్వాలా దిశగా కదులుతున్న 150 మంది పౌరులపై విమానాల నుంచి మెషిన్గన్ ద్వారా 50 రౌండ్ల కాల్పులు జరిపారు. చుట్టు పక్కల గ్రామాలపై ఇలాగే దాడులు జరిపారు. చివరకు గుజ్రన్వాలా నడిబొడ్డున బాంబులు వేసి, కాల్పులు జరిపి విమానాలు తిరుగుముఖం పట్టాయి. ఆకాశం నుంచి కురిసిన అగ్నివర్షానికి కిందున్నవారు కకావికలైపోయారు. పిల్లలు, పెద్దలు అనేకమంది మరణించారు. మరెందరో తీవ్రగాయాల పాలయ్యారు. గుజ్రన్వాలా డిప్యూటీ కమిషనర్ అధికారికంగా పంపిన నివేదికలో 11 మంది మరణించినట్టు, 27 మంది గాయపడినట్టు తెలిపాడు. జలియన్వాలాబాగ్లోనూ అధికారిక నివేదికలో మృతుల సంఖ్య తగ్గించి చెప్పడం చరిత్ర.
పౌరుల పైకి అలా యుద్ధ విమానాలు పంపడం చరిత్రలో బహుశా అదే మొదలేమో. బీజీ హార్నిమన్ తన ‘బాంబే క్రానికల్’ పత్రికలో పంజాబ్లో జరిగిన ఇలాంటి ఘాతుకాలను బయటపెట్టాడు. సెన్సార్షిప్ను ధిక్కరించి వార్తలు రాశాడు. దాంతో బ్రిటిష్ అధికారులు ఆయనకు దేశబహిష్కార శిక్ష విధించి, లండన్ పంపించి వేశారు. బ్రిటన్లో పంజాబ్ దమనకాండపై గగ్గోలు మొదలైంది. భారతీయ వ్యవహారాల సెక్రెటరీ మాంటెగ్ను హౌస్ ఆఫ్ కామన్స్ ముందుకు పిలిపించారు. పౌరులపైకి యుద్ధవిమానాలు ప్రయోగించడంపై సభ్యులు మందలించారు. ఇంతకు మించి పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇదీ బ్రిటిష్వాడి న్యాయం.
మహాత్ముడి కారుపై బాంబు దాడి!
గాంధీజీని గాడ్సే హత్య చేశాడని అందరికీ తెలుసు. అంతకంటే 14 ఏండ్ల ముందు ఇంకొకరు కూడా ఆయనను చంపేందుకు కుట్రపన్నారని ఎందరికి తెలుసు?గాంధీ హరిజన సేవకు అంకితం కావడం ఎంతోమంది కాంగ్రెస్ నేతలకు రుచించలేదు. ముస్లింలకు రిజర్వ్ చేసిన మెక్ డొనాల్డ్ అవార్డు పట్ల గాంధీజీతో ఇతరులకు విభేదాలు వచ్చాయి. బాంబే ప్రెసిడెన్సీలోని సవర్ణ హిందువులు గాంధీజీపై కోపం పెంచుకున్నారు. 1934 ఏప్రిల్, జూలై నెలల్ల్లో గాంధీజీ నిర్వహించతలపెట్టిన హరిజన మీటింగులను భగ్నం చేశారు. పూనాలో జూన్ 25న గాంధీ ప్రయాణిస్తున్న కారుమీద బాంబు విసిరారు. ఆయన తృటిలో తప్పించుకున్నారు. ప్రాణాలతో బయటపడ్డారు. అంతకు ముందెన్నడూ ఈ తరహా దాడులు భారత జాతీయోద్యమ నాయకులపై జరగలేదు.