సంగారెడ్డి, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ): ప్రపంచంలోని 65 శాతం మంది పిల్లలు భారత్లో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్లను వేసుకుంటున్నట్టు భారత్ బయోటెక్ కంపెనీ వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణ ఎల్లా తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కందిలో ఐఐటీ హైదరాబాద్ వ్యవస్థాపక వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భంగా కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. వ్యాక్సిన్ రంగంలో భారత్ ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందుతున్నట్టు చెప్పారు. భారత్ బయోటెక్ కరోనా సమయంలో వ్యాక్సిన్లపై అనేక పరిశోధనలు చేసి కోవాగ్జిన్ రూపొంచిందినట్టు తెలిపారు. దీన్ని సొంత నిధులతో తీసుకొచ్చినట్టు చెప్పారు. వ్యాక్సిన్ రంగం లో కొత్త ఆవిష్కరణలు జరగాలంటే క్లినికిల్ ట్రయల్స్ కీలకం అన్నారు. మన దేశం నుంచి మాలిక్యులర్ వ్యాక్సిన్ రావాలన్నది తన కల అని పేర్కొన్నారు. ఎవరూ ఊహించని విధంగా తమ సంస్థ నాజల్ వ్యాక్సిన్ తీసుకు వస్తున్నట్టు చెప్పారు. మన దేశం నుంచి మేధోవలసలు, మానవ వనరుల ఎగుమతి నిలిచిపోతే ప్రపంచ దేశాలపై ప్రభావం పడుతుందని అన్నారు. ఐఐటీ గవర్నింగ్ బాడీ చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ఐఐటీ హైదరాబాద్ అకడమిక్, ఆవిష్కరణలు, పరిశోధన రంగాల్లో ముందంజలో ఉన్నట్టు తెలిపారు. ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. మొదటితరం ఐఐటీలు 50 సంవత్సరాల్లో సాధించిన ఫలితాలను ఐఐటీహెచ్ 15 ఏండ్లలోనే సాధించినట్టు చెప్పారు. కాగా ఐఐటీ హైదరాబాద్ వేర్వేరు అంశాల్లో సాధించిన ఐదు ఐఎస్వో సర్టిఫికెట్లను ఆ సంస్థ ప్రతినిధి ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తికి అందజేశారు.