హైదరాబాద్ సిటీబ్యూరో/శంషాబాద్ రూరల్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లే ఎయిర్ఇండియా విమానాన్ని హైజాక్ చేస్తున్నట్టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ భద్రతా అధికారులకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాన్ని రద్దు చేసి, శంషాబాద్ విమానాశ్రయంలో హైఅలర్ట్ ప్రకటించి, విస్తృత తనిఖీలు చేశారు. బెదిరింపు మెయిల్లో పేర్కొన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆదివారం రాత్రి 8 గంటలకు హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లనున్న విమానాన్ని హైజాక్ చేస్తున్నట్టు ఎయిర్పోర్టు భద్రత అధికారులకు రాత్రి 7.30 గంటల సమయంలో ఈ-మెయిల్ వచ్చింది.
అప్రమత్తమైన భద్రత బలగాలు రంగంలోకి దిగి విమానాశ్రయాన్ని జల్లెడ పట్టాయి. అదే విమానంలో ప్రయాణించే బండినేటి తిరుపతయ్య ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థకు ఇన్ఫార్మర్గా పని చేస్తున్నట్టు మెయిల్లో ఉండటంతో తిరుపతయ్యతో పాటు రాకేశ్, వినోద్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. వీరు జగిత్యాల జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. బెదిరింపు మెయిల్ ఉత్తదేనని తేల్చినట్టు ఆర్జీఐఏ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. తిరుపతయ్యను చూసేందుకు వచ్చిన మహిళను సైతం విచారిస్తున్నట్టు చెప్పారు. విమానంలో ప్రయాణించాల్సిన 111 మందిని గమ్యస్థానాలకు పంపారు.