శంషాబాద్, మార్చి 13: సినీ ఫక్కీలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు స్మగ్లర్లు కస్టమ్స్ అధికారులకు చిక్కారు. బంగారం ముక్కలను నోట్లో పెట్టుకుని తరలిస్తున్న నలుగురిని, పేస్టుగా తయారుచేసి చెప్పుల్లో పెట్టి స్మగ్లింగ్ చేస్తున్న మరొకరిని శనివారం శంషాబాద్ విమానాశ్రయంలో వేర్వేరుగా పట్టుకున్నారు. రూ.48లక్షలకుపైగా విలువైన 1,143 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి హైదరాబాద్కు వచ్చిన విమానంలో నలుగురు ప్రయాణికులపై అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. వీరు బంగారాన్ని ముక్కలుగా చేసి నోటిలో దాచి అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. వీరినుంచి రూ.20.67 లక్షల విలువైన 471 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుని, నిందితులను అదుపులోకి తీసుకొన్నారు. మరో ఘటనలో షార్జా నుంచి హైదరాబాద్ వచ్చిన విమానం నుంచి దిగిన ఓ ప్రయాణికుడిని అధికారులు తనిఖీచేశారు. ప్రత్యేకంగా తయారుచేసిన చెప్పుల్లో పేస్టుగా చేసి రూ.27.4 లక్షల విలువచేసే 672 గ్రాముల బంగారాన్ని తీసుకొచ్చినట్టు గుర్తించారు. బంగారం స్వాధీనం చేసుకుని.. అతన్ని అరెస్టు చేశారు.