హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): దేశచరిత్రకే వక్రభాష్యం చెప్తున్న బీజేపీ.. ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటాన్ని సైతం అవమానిస్తున్నది. నిజాం మద్దతుదారులపై వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించిన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్యలను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్రెడ్డి హేళన చేశారు. వారి పోరాటాన్ని ‘చిట్టెలుకపై చేసిన చిన్నపోరాటం’గా అభివర్ణించారు. వారి పోరాటం ఒక సంస్థానంపై మాత్రమేనని, నిజాంపై కాదంటూ చరిత్రకు వక్రభాష్యం చెప్పారు. గురువారం ఓ టీవీ చానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్రెడ్డి.. పదే పదే అమరుల పోరాటాన్ని అవమానించారు. ‘దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ పోరాటం విసునూరు రామచంద్రారెడ్డి మీద తప్ప నిజాం మీద కాదు.
రామచంద్రారెడ్డి ఒక చిట్టెలుక, ఆఫ్ట్రాల్ ఓ చిట్టెలుక.. ఆయనపై పోరాటాన్ని పట్టుకొని మొత్తం తెలంగాణకు ఆపాదిస్తే ఎలా? అది ఒక ఊరి సంఘటన. చిన్న చిట్టెలుకపై పోరాటాన్ని పట్టుకొని సాయుధ పోరాటం అంటే ఎలా?’ అని వ్యాఖ్యానించారు. దీనిపై రజక సంఘాలు, ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. బడుగులంటే బీజేపీకి చిన్నచూపు అనే విషయం మరోసారి నిరూపితమైందని మండిపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల బీజేపీకి వ్యతిరేకంగా ప్రజాసంఘాలు నిరసనలు చేపట్టాయి.
చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్యల సాయుధ పోరాటాన్ని కించపరిచిన బీజేపీ నేత ప్రకాశ్రెడ్డి క్షమాపణ చెప్పేందుకు తాము ఇచ్చిన 24 గంటల గడువు ముగిసిందని తెలంగాణ రజకవృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య పేర్కొన్నారు. యాదవ, గొల్ల, కురుమ, రజక, ప్రజాసంఘాలు, యువజన సంఘాలతో కలిసి శనివారం నుంచి ఉద్యమం చేపట్టనున్నట్టు ప్రకటించారు. బీజేపీ క్షమాపణ చెప్పేవరకు బండి సంజయ్ పాదయాత్రను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.
శుక్రవారం తెలంగాణ రజకవృత్తిదారుల సంఘం, ప్రజాసంఘాలు కలిసి హైదరాబాద్లో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజల విముక్తి కోసం వీరోచితంగా పోరాడిన త్యాగధనులు చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్యలను అవమానించడమంటే తెలంగాణ సమాజాన్ని అవమానించినట్టేనని అన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నేతలు బాలాపూర్ బాల్రాజ్, ఎల్చాల దత్తాత్రేయ, రంజన్ యాదవ్, మల్లేశ్ కురుమ, జ్యోతి, ఉపేందర్, సకినాల రవి, పెద్దాపురం కుమారస్వామి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ తన ఉనికి కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హెచ్చరించారు. బడుగు, బలహీన వర్గాలంటే కమలంపార్టీ నేతలకు ఎప్పటికీ చిన్నచూపేనని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర నేపథ్యం తెలియకుండానే.. కేంద్ర హోంమంత్రి అమిత్షా హైదరాబాద్కు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు.
చాకలి ఐలమ్మ చరిత్రను అవమానించి, వక్రీకరించిన బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు అమిత్షా క్షమాపణ చెప్పిన తర్వాతే హైదరాబాద్లో అడుగు పెట్టాలని సారయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాటయోధుల విలువ తెలియని అవివేక పార్టీ బీజేపీ అని విమర్శించారు. ఐలమ్మను, ఆమె వారసత్వాన్ని విమర్శిస్తే బీజేపీ నేతలను తెలంగాణ నుంచి ఉరికిస్తామని తేల్చిచెప్పారు.