కొండాపూర్, సెప్టెంబర్ 29: గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకొని బుధవారం ఆకస్మిక గుండె సంబంధిత మరణాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హృదయ సంబంధిత మరణాలకు చెక్ పెట్టేందుకు అత్యవసర సమయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రదర్శన ద్వారా హార్ట్ మార్షల్స్కు శిక్షణ ఇచ్చారు. ఇటువంటి కార్యక్రమాలతో అత్యవసరంలో ఎదుటివారి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఆరునెలల్లో 10 వేల మంది హార్ట్ మార్షల్స్కు శిక్షణ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. గుండె సంబంధిత వ్యాధులతో ఏటా దేశంలో ఏడు లక్షల మంది ఆకస్మికంగా చనిపోతున్నట్టు తెలిపారు. అధిక రక్తపోటు, హృదయ సంబంధిత వ్యాధుల కారణంగా ఆకస్మిక మరణాలు సంభవిస్తుంటాయని పేర్కొన్నారు.