హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్ కాలేజీలకు అనుమతుల విషయంలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇక నుంచి మూడేండ్లకొకమారు కాలేజీలకు అనుమతులివ్వాలని నిర్ణయించింది. ఇప్పటివరకు వార్షిక ప్రాతిపదికన కాలేజీలకు అనుమతులు మంజూరుచేయగా, ఈ విధానాన్ని ఏఐసీటీఈ ఉపసంహరించింది.
2024 -27 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్ కాలేజీల అప్రూవల్ హ్యాండ్బుక్ను ఏఐసీటీఈ శుక్రవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏఐసీటీఈ వైస్చైర్మన్ అభయ్జెరె వర్చువల్గా మాట్లాడుతూ.. 2024 విద్యాసంవత్సరం నుంచి మూడేండ్లకొకసారి కాలేజీలకు అనుమతులివ్వనున్నామని వెల్లడించారు.
బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) కోర్సులు అందించే కాలేజీలు ఏఐసీటీఈ నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాలని సూచించారు. ఇక యూజీ ఇంజినీరింగ్, టెక్నాలజీ ప్రోగ్రాముల్లో ఫ్యాకల్టీ, స్టూడెంట్ రేషియోను 1: 15 నుంచి 1 : 20కి పెంచినట్టు వివరించారు.