హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : దేశంలో 2047 నాటికి ఆధిక శాతం విద్యావంతులుగా ఉంటారని, పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతారని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చైర్మన్ టీజీ సీతారామ్ అన్నారు. జేఎన్టీయూ హైదరాబాద్లో శుక్రవారం ‘నావిగేటీవ్ ది ఆపర్చునిటీస్ ఇన్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ ఫ్యూచర్ భారత్’ అనే అంశంపై నిర్వహించిన ఒక్కరోజు సదస్సులో సీతారామ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా సొంతంగా పరిశ్రమలు పెట్టుకోవడంతో పాటు ఎందరో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే స్థాయికి చేరుకొంటారని అభిప్రాయపడ్డారు. స్కూల్ స్థాయి నుంచి బయటకు వస్తున్న 100 మందిలో 25% నుంచి 30% మంది మాత్రమే విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సులలో చేరుతున్నట్టు తెలిపారు.
ఈ సంఖ్య 2035 నాటికి 50 శాతానికి పెరుగుతుందని చెప్పారు. మాడల్ స్కూల్, ప్రాథమిక విద్యను మెరుగుపరిస్తేనే అమృత్కాల్ లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. జేఎన్టీయూ వీసీ కట్టా నరసింహారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో పూర్వకాలంలోనే గొప్ప ఇంజినీరింగ్ ప్రతిభ కలిగి ఉన్నదని చెప్పారు. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించకుండా పెద్ద కట్టడాలు నిర్మించిన గొప్ప పరిజ్ఞానం మన దేశానిదని తెలిపారు. కార్యక్రమంలో అఖిల భారత రాష్ట్రీయ షైక్షిక్ మహాసంఘ్ జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గుంత లక్ష్మణ్, జేఎన్టీయూ రెక్టార్ డాక్టర్ కే విజయకుమార్రెడ్డి, రిజిస్ట్రర్ డాక్టర్ కే వెంకటేశ్వరరావు, డైరెక్టర్ జీ విజయ్కుమారి, ప్రిన్సిపల్ జీవీ నర్సింహారెడ్డి, వర్సిటీ ప్రొఫెసర్లు, తదితరులు పాల్గొన్నారు.