హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీ వినియోగం, పన్నుల ఆదాయంపై నిరంతరం సమీక్ష, పకడ్బందీ నిర్వహణతో వివిధ శాఖల్లో ఆదాయం పెరుగుదల కనిపిస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార తెలిపారు. కమర్షియల్ టాక్స్శాఖలో జీఎస్టీ ఆదాయం మూడు నెలలుగా 15 శాతం పెరిగినట్టు పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో రెవెన్యూ జనరేషన్, రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం భట్టి అధ్యక్షతన జరిగింది. కమిటీలో సభ్యులైన మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు.
ఇదే తరహాలో రిజిస్ట్రేషన్ శాఖలో సైతం ఆదాయంలో పెరుగుదల కనిపించిందని తెలిపారు. 2047 వరకు త్రీ ట్రిలియన్ డా లర్ ఎకానమీ సాధన లక్ష్యంగా అన్నిశాఖలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో భూముల విక్రయానికి సంబంధించి ప్రపంచ స్థాయిలో ప్రచారం నిర్వహించాలని, తద్వారా ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంటుందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు.