ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, పాల్రెండ్ గ్రూప్ మాజీ చైర్మన్ పాలెం శ్రీకాంత్ రెడ్డి జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. వాటన్నింటినీ స్ఫూర్తిమంతంగా చెప్పాలనే తపనతోనే ‘ఎహెడ్ ఆఫ్ టైమ్స్’ పుస్తకం రాసినట్లు ప్రాలిఫిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ గ్లోబల్ సీఎఫ్వో బిజు ఎస్. నాయర్ చెప్పారు. ఆయన తొలిసారిగా రచించిన ఈ పుస్తకంలో పాలెం శ్రీకాంత్ రెడ్డి ఆలోచనా విధానం, జీవన విధానాలను ఎంతో స్ఫూర్తిమంతంగా వివరించినట్లు చెప్పుకొచ్చారు.
అత్యంత క్లిష్టమైన సమస్యలకు కూడా సులభమైన పరిష్కారాలు కనుక్కోవడంలో శ్రీకాంత్ రెడ్డి దిట్ట. ఈ విషయంలో ఆయన ఆలోచనా విధానం తెలుసుకోవడం వల్ల ఎంతో మంది జీవితాలు మారతాయి. ఈ క్రమంలోనే తను రాసిన పుస్తకం గురించి మాట్లాడిన బిజు ఎస్. నాయర్.. ‘‘నా స్నేహితుడు, మెంటార్, అద్భుతమైన ప్రొఫెషనల్, అత్యద్భుతమైన మనిషి పాలెం శ్రీకాంత్కు నేనిచ్చే మనఃపూర్వక నివాళి ఈ ‘ఎహెడ్ ఆఫ్ టైమ్స్’ పుస్తకం. నాతోపాటు చాలామంది జీవితాలపై పాలెం శ్రీకాంత్ ప్రభావం ఎంతగానో ఉంది.
ఎలాంటి సమస్యనైనా చిటికెలో చాలా క్లారిటీతో పరిష్కరించేవాడు తను. ఈ పుస్తకం తనకు నివాళిగా రాసినప్పటికీ.. దీంతో మరింత మందిలో స్ఫూర్తి నింపాలని, పాలెం శ్రీకాంత్ నాయకత్వ విధానాన్ని పరిచయం చేసి వాళ్లందరూ కూడా గొప్ప నాయకులుగా మారేందుకు ఈ పుస్తకం ఉపయోగపడాలనేది నా ఉద్దేశ్యం. మనం చేసే ప్రతి మంచి పని ప్రపంచాన్ని కదిలిస్తుంది. దీన్ని నేను పాలెం శ్రీకాంత్లో చూశాను. ఆయన ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉండేవారు. ఏదో ఒక విధంగా సమాజానికి మంచి చేయాలని తపించేవారు’’ అని వెల్లడించారు.