వేసవికి ముందే భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదలక, కాల్వలు, చెక్ డ్యాములు నింపక ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడంతో లక్షలాది ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకమైంది. కాల్వలు పారకపోవడంతో బోర్ల వినియోగం ఎక్కువైంది. ఫలితంగా భూగర్భ జలాలు క్రమంగా బోర్లకు అందనంత లోతుకు పడిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మున్ముందు పరిస్థితి ఏంటో తెలియక రైతన్నల్లో గుబులు మొదలైంది.
రాష్ట్రవ్యాప్తంగా గతేడాది 6.8 మీటర్లు ఉన్న భూగర్భ జలమట్టం.. ప్రస్తుతం 7.72 మీటర్లకు పడిపోయింది. కృష్ణా బేసిన్లో భూగర్భ జలాల పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. సాగర్, శ్రీశైలంతోపాటు పలు ప్రాజెక్టులు డెడ్స్టోరేజీకి చేరుకోవడంతో యాసంగిలో సాగు వద్దని అధికారులే సూచించడం అన్నదాతలను కలవరానికి గురిచేస్తున్నది.
Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి25 (నమస్తే తెలంగాణ): వేసవికి ముందే రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. నిరుడు ఇదే సమయంతో పోల్చితే భూగర్భ జలాలు సగటున 1.50 మీటర్ల లోతుకు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా గత డిసెంబర్ నాటికి 859 మిల్లీమీటర్ల వర్షపాతానికి గాను 914 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే 6 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అయినప్పటికీ భూగర్భ జలాలు మాత్రం వేగంగా ఆవిరైపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలమట్టం గత నెల 6.8 మీటర్లు ఉండగా, ప్రస్తుతం అది 7.72 మీటర్లకు పడిపోయింది.
రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో మాత్రమే 5 మీటర్ల లోపు జలమట్టం ఉండగా, 25 జిల్లాల్లో 10 మీటర్లు, మిగిలిన నాలుగు జిల్లాల్లో 10 మీటర్లకు పైగా లోతులో భూగర్భ జలాలు ఉన్నట్టు సంబంధితశాఖ నివేదిక వెల్లడించింది. ప్రాజెక్టుల ద్వారా ఆశించిన స్థాయిలో నీటిని విడుదల చేయకపోవడం, గతంలో మాదిరిగా చెరువులను సక్రమంగా నింపకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం క్రమం తప్పకుండా చెరువులను, చెక్ డ్యాములను నింపడం వల్ల మండు వేసవిలోనూ భూగర్భ జలాలు పడిపోకుండా స్థిరంగా ఉన్నాయి. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. కాలువలు, చెరువుల్లో ఆశించినస్థాయిలో నీళ్లు లేకపోవడంతో రైతులు బోరుబావులపై ఆధారపడుతుండడంతో భూగర్భ జలాలు వేగంగా తరిగిపోతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా కృష్ణాబేసిన్లో భూగర్భజలాల పరిస్థితి ఈ ఏడాది మరింత దారుణంగా ఉన్నది. బేసిన్లోని ప్రాజెక్టులకు ఆశించినస్థాయిలో వరదలు రాకపోవడంతో ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండలేదు. ఇప్పటికే శ్రీశైలం, సాగర్తోపాటు పలు ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరువలో ఉన్నాయి. ప్రాజెక్టులు నిండకపోవడంతో యాసంగిలో పంటలు వేసుకోకపోవడమే మేలని అధికారులు ప్రకటించారు. బేసిన్లోని కొందరు రైతులు మాత్రం బోరు బావులపై ఆధారపడి యాసంగి పంటలను సాగుచేస్తుండడంతో బేసిన్ పరిధిలోని భూగర్భ జలాలు మరింత వేగంగా అడుగంటుతున్నాయి. నాగర్కర్నూల్ జిల్లాలో 3.57మీటర్లు, నల్లగొండలో 3.41 మీటర్లు, వికారాబాద్లో 3.26 మీటర్లు, మహబూబ్నగర్లో 3.12 మీటర్లు, రంగారెడ్డిలో 2.93 మీటర్లు, నారాయణపేటలో 2.72 మీటర్లు, సూర్యాపేటలో 2.74 మీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2.38 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోవడం అక్కడి పరిస్థితిని తెలియజేస్తున్నది.
సమృద్ధిగా వర్షాలు కురిసినా, ఆశించిన స్థాయిలో వరద వచ్చినా గోదావరి బేసిన్లోనూ ఈ ఏడాది భూగర్భజలాల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. చాలా జిల్లాల్లో భూగర్భజలాలు పోయినేడాదితో పోల్చితే గణనీయంగా పడిపోతున్నాయి. 2019లో కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి గోదావరి జలాలను పరిపూర్ణంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. ఆ ప్రాజెక్టుతో ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, నిజాంసాగర్, సింగూరు, ఎగువ మానేరు, దిగువ మానేరు, కడెం, వరదకాలువ తదితర ప్రాజెక్టులను అనుసంధానించి అవసరం మేరకు ఎప్పటికప్పుడు జలాలను ఎత్తిపోసి, తద్వారా ఆయా ప్రాజెక్టులకు కింద ఉన్న చెరువులను క్రమం తప్పకుండా నీటితో నింపారు. మేడిగడ్డ డ్యామేజీ పేరిట ప్రభుత్వం ఈ ఏడాది ఆ పని చేయడం లేదు. చెరువులను, చెక్డ్యామ్లను నింపడం లేదు. ఫలితంగా బేసిన్లోనూ భూగర్భజలాలు నిరుటితో పోల్చితే త్వరితగతిన అడుగంటుతున్నాయి. హనుమకొండ మినహా గోదావరి బేసిన్లోని మిగిలిన అన్నిజిల్లాలో ఈ ఏడాది భూగర్భజలాలు లోతుకు పడిపోయాయి.
నిరుడు మేలోనూ భూగర్భ జలాలు ఏమాత్రం తగ్గలేదు. 20 జిల్లాల్లో 2.39 మీటర్లలోనే భూగర్భ జలాలు ఉండేవి. 13 జిల్లాల్లోనే స్వల్పంగా భూగర్భ జలాలు కొంతమేరకు తగ్గాయి. మొత్తంగా 33 జిల్లాలకుగాను 24 జిల్లాల్లో 5-10మీటర్ల లోతులో, మిగిలిన 8 జిల్లాల్లో 10-15 మీటర్ల లోతులో, ఒక జిల్లాలో 15 మీటర్లకుపైగా లోతులో భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నట్టు గత మేలో భూగర్భజలశాఖ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఫిబ్రవరి మాసాంతానికే రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 1.50 మీటర్ల మేరకు భూగర్భజలమట్టం పడిపోయింది.
కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు ఆశించిన స్థాయిలో నీరు రాకపోవడం, గోదావరి బేసిన్లో నీరున్నా చెరువుల నింపకపోవడం, కాలువల ద్వారా నీటిని పూర్తిస్థాయిలో అందించకపోవడమే భూగర్భ జలమట్టం పడిపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తున్నది. వాస్తవంగా భూగర్భ జలమట్టాన్ని పెంచడంలో చెరువులు, కాలువలు, ప్రాజెక్టులు, చెక్డ్యామ్లు, పరోలేషన్ రీఛార్జ్ నిర్మాణాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో కాలువలు, చెరువుల ద్వారానే 10 శాతానికి పైగా భూగర్భజలమట్టం రీచార్జ్ అవుతుంటుంది. ఈసారి చెరువులను నింపకపోవడం, కాలువల ద్వారా సాగునీటి సరఫరా లేకపోవడంతో ఆ మేరకు భూగర్భ జలరీచార్జ్ తగ్గిపోయింది. ఆయా మార్గాల ద్వారా నీటి సరఫరా లేకపోవడంతో రైతాంగం పూర్తిగా భూగర్భ జలాలమీదనే ఆధారపడింది. ఎక్కడికక్కడ బోర్ల ద్వారా 24గంటల పాటు నీళ్లను తోడివేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో గతంలో కంటే వేగంగా భూగర్భ జలాలు పడిపోతున్నాయని అర్థమవుతున్నది.
భూగర్భ జలాలు పడిపోతుండడంతో నిన్నమొన్నటి వరకు నిండుగా పోసిన బోరుబావులు ఇప్పుడు మొరాయిస్తున్నాయి. పదుల సంఖ్యలో, వందల ఫీట్లలో బోర్లు వేయడం, నీటి ఊటలేక అవి ఎందుకూ కొరగాకుండా పోవడం పరిపాటిగా మారింది.అర ఎకరా, ఎకరా సాగుచేయడమే గగనంగా మారింది. గత ప్రభుత్వం క్రమంగా చెరువులను నింపడం ద్వారా 30 లక్షల బోర్లు కింద దాదాపు 45 లక్షల ఎకరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగునీరు అందింది. ప్రస్తుతం ఆ ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. అందులో సగం కూడా పండని దుస్థితి క్షేత్రస్థాయిలో నెలకొనడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు.
ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు చందు గంగారాం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బుడ్మి గ్రామ శివారులో నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కాలువ కింద మూడున్నర ఎకరాల పొలం ఉంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విద్యుత్తు, సాగునీటి కొరత లేకపోవడంతో పుష్కలంగా పంటలు పండించుకునేవాడు. ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నది. పంటలకు సాగునీరు అందక పొలాల్లో నెర్రెలు బారుతున్నాయి. రైతులకు అవసరాన్ని బట్టి నీటిని విడుదల చేపట్టడం ఒక ఎత్తయితే, లీకేజీ నీటిని నిత్యం వదలడంతో పంటలకు నష్టం కలిగే అవకాశం ఉన్నదని ఆందోళన చెందుతున్నాడు. యాసంగిలో సాగునీటి ఇబ్బందులు తప్పేలా లేవని గంగారాం ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు.
ఈ ఫొటోలోని రైతు పేరు కోపాయి జలేందర్. ఇతడికి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం లోలం గ్రామంలో మూడెకరాల పొలం ఉంది. సమీపంలో చెరువులు ఉండగా, పొలంలో ఒక బోరు కూడా వేసుకున్నాడు పదేండ్ల నుంచి వరి పండిస్తున్నాడు. ఏనాడూ సాగునీటికి ఇబ్బందులు తలెత్తలేదు. ఈసారి కూడా వరి సాగుచేస్తున్నాడు. పదిరోజుల క్రితం బోరు ఎత్తిపోయింది. భూగర్భ జలాలతోపాటుచెరువుల్లో నీరు కూడా తగ్గిపోయింది. దీంతో చేతికి అందివచ్చిన వరి పంట మొత్తం ఎండిపోతుండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే వచ్చే రోజుల్లో ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నాడు.
మూడు ఎకరాల ఎవసం ఉన్నా ఏం లాభం? బాయిలల్ల నీళ్లు ఎల్లేటట్టులేవు. ఎవసం సంబరంగా ఉంటదని అనుకుంటే మా బతుకులు ఆగమవుతున్నయి. ఎకరంమీద వరి, ఎకరంన్నర మక్క ఏసిన. పంటలు మంచిగ పండుతయని అనుకున్నం. దీనికే రూ. 30 వేల పెట్టుబడి తెచ్చిపెట్టిన. సేను మంచిగ పొట్టకు వచ్చేటైంల, మక్కసేను పీసులు ఏసే టైంల ఎండిపోతున్నయి. బాయిల నీళ్లు ఎల్లుతలేవు. గంట ఎల్లుడే కష్టమవుతున్నది. తెచ్చిన పైసలు మీద పడేటట్టు ఉన్నది. కాలం మంచిగ అయితదని అనుకుంటే కాలం గిట్ల సేసింది. అప్పుడో ఇప్పుడో వానలు పడతయని అనుకుంటే వానలు పడలే. నీళ్లు ఎల్లక సేను సేతికి రాకముందే పీసులు రాలిపోతున్నయి. ఎట్లన్న సేసి సర్కారు మమ్మల్ని ఆదుకుంటనే బతుకులు ఉంటయి. లేకుంటే ఎవ్వలు అప్పులు ఇయ్యరు. ఎవసం సేసుడు కూడా కట్టమే.
– దొంతరబోయిన రాజయ్య, రైతు, హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా
మాకు మూడెకరాల వ్యవసాయం ఉన్నది. ఇండ్ల ఎకరంన్నర వరిసేనుపెట్టిన. ఎండకాలం నీళ్లు ఎల్లయి అని ముందుగనే అనుకుని సగమే పెట్టినం. దీనికే రూ. 30 వేలదాక పెట్టుబడి పెట్టిన. పోయినసారి కూడా వరి ఎండి పోయేటట్టు ఉండె. ఆరపల్లి సెరువులకు నీళ్లు ఇడిసిపెట్టేది. ఈసారి నీళ్లు ఇడిసిపెట్టలేదు. మా సేను అంతా ఎండిపోయింది. మడి ఎనుక మడి ఎండుకుంటపోయింది. రోజుకు గంట నీళ్లు ఎల్లుతున్నయి. సక్కగ పొలం పారుతలేదు. పల్లెచెరువులకు నీళ్లు ఇడిసిపెడుతరు.. బాయిలు ఉబ్బుతయి అని అనుకున్నం. కానీ ఇడిసిపెట్టక పొలం ఎండిపోయింది.
-చెన్నూరి వెంకటేశం, రైతు, హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా
ఐదేండ్ల సంది ఈ పరిస్థితి ఇప్పుడే చూస్తున్నాం. కాల్వల్లో నీళ్లు లేకుండా ఎప్పుడూ లేదు. వానకాలం, యాసంగి నిండా నీళ్లు వచ్చేది. ఈ ఏడు మిరుప పంట బాగా దెబ్బతిన్నది. మిరుప తీసేసి యాసంగిలో మక్క, వరి పొలం వేశాం. వారానికి ఒకసారి నీళ్లు వదిలితే అవి కాలువ తడవడానికే సరిపోతున్నాయి. చిన్న కాల్వలకు రావడం లేదు. బావుల నీరు రెండు మూడు గంటలే వస్తున్నది. అందుకే క్రేన్తో లోతు తీస్తున్నాం. వరుసగా కాల్వల్లో నీరు వదిలి పెట్టకుంటే పంటలు పండుడు కష్టమే.
-అజ్మీరా శ్రీను, గోపతండా, మహబూబాబాద్
మా ఊళ్లో నాకు ఆరెకరాల బత్తాయి తోట ఉన్నది. నీళ్లు లేక పంట ఆగమైతున్నది. గత నెల రోజుల్లో 13 బోర్లు వేసిన. రూ. 2.75 లక్షలు ఖర్చు అయింది. ఒక్కో బోరు 180 నుంచి 230 ఫీట్ల వరకు వేసిన. అయినా ఒక్క బోరు మాత్రమే ఇంచు నీళ్లు పోస్తున్నది. ప్రభుత్వం సాగర్ ఎడమ కాల్వకు నీళ్లు ఇస్తే కొంతమేర భూగర్భజలాలు పెరిగి బత్తాయి తోటలు ఎండిపోకుండా ఉండేవి. ఇప్పుడు ఆర్థిక భారం పెరిగి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.
-జెర్రిపోతుల జానయ్య, రైతు, కొణతాలపల్లి, త్రిపురారం మండలం, నల్లగొండ
గతంలో ఎస్సీ కార్పొరేషన్లో మంజూరైన ఈనాం భూమి 1.10 ఎకరాల్లో వేసిన బత్తాయి తోట పెట్టిన. అప్పుడు వేసిన బోరు ఇప్పుడు వట్టిపోయింది. నీళ్లు లేక చెట్లు ఎండిపోయే పరిస్థితి దాపురించింది. ఇన్నేండ్లలో ఇంతగా సాగునీటి ఇబ్బందులు ఎప్పుడూ చూడలేదు. చెట్లను కాపాడుకోవాలని తోటలో ఇంకో బోరు వేయిస్తున్నా. మా ఊళ్లో 450 ఫీట్ల తోతు బోరు వేయించినా నీటి జాడ దొరుకుతలేదు. ఇంత ఖర్చు పెట్టి బోరు వేస్తున్నా నీళ్లు పడుతాయనే నమ్మకం లేదు. తోటను దేవుడే కాపాడాలె.
-లకుమాల మధుబాబు, ఎర్రబెల్లి, నిడమనూరు మండలం, నల్లగొండ