చిక్కడపల్లి/హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ):వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు బీజేపీ కట్టబెడుతున్నదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి టీ సాగర్ విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థిని ఓడించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పీ జంగారెడ్డి, డాక్టర్ అరిబండి ప్రసాదరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్తో కలిసి బుధవారం కరపత్రాలు విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం, రైతులకు వస్తున్న ఆదాయాన్ని దెబ్బతీస్తున్నదని మండిపడ్డారు. కార్పొరేట్లకు వ్యవసాయాన్ని ధారాదత్తం చేసేందుకే వ్యవసాయ నల్లచట్టాలను తెచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో 25 లక్షల మోటర్లకు మీటర్లు పెట్టేందుకు బీజేపీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని ధ్వజమెత్తారు.మునుగోడు ఉప ఎన్నికలో రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల బీజేపీని ఓడించి, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.