హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 13,32,827 క్వింటాళ్ల సన్నరకం వరి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. శుక్రవారం సచివాలయంలో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ, జిల్లాల వారీగా అమ్మకాలు, పత్తి విత్తనాల అమ్మకాలు, లభ్యత వివరాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించా రు. నిరుటి కంటే ఈ ఏడాది 15.75 లక్షల క్వింటాళ్ల విత్తనాలను అధికంగా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. వర్షాల కారణంగా కొన్నిచోట్ల పచ్చిరొట్ట విత్తనాలకు అధిక డిమాండ్ ఉన్నదని, ఆ మేరకు ఏజెన్సీలతో సీడ్స్, నేషనల్ సీడ్ కార్పొరేషన్తో సమన్వయం చేసుకొంటూ అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 50,942 క్వింటాళ్ల జీలుగ, 11,616 క్వింటాళ్ల జనుము, 236 క్వింటాళ్ల పిల్లి పెసర విత్తనాలను అందుబాటులో ఉంచామని వివరించారు. 20,518 క్వింటాళ్లు అంటే రూ.1140.22 కోట్ల విలువైన విత్తనాలను రైతులు కొనుగోలు చేశారని అధికారులు మంత్రికి వివరించారు. 30,400 క్వింటాళ్ల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అవసరం మేరకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. అన్ని జిల్లాల్లో ఇప్పటికే 56 లక్షల పత్తి ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని, 7.22 లక్షల పత్తివిత్తన ప్యాకెట్ల విక్రయం జరిగిందని తెలిపారు. అన్ని స్టాక్ పాయింట్లను రోజువారీ తనిఖీలు చేస్తూ ఎరువుల సరఫరాలో ఎకడా ఆటంకం రాకుండా సరఫరా చేయాలని మంత్రి ఆదేశించారు. అంతకు ముందు రైతు భరోసా, పంటల బీమా విధివిధానాలపై అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్రెడ్డి, సభ్యుడు నల్లమల వెంకటేశ్వర్లుతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చించారు.