హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) ఉద్యోగులకు నూతన హెచ్ఆర్ పాలసీ అమలుచేసేందుకు కృషి చేస్తానని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఈ అంశంపై ఏర్పాటుచేసిన కమిటీ వెంటనే నివేదిక సమర్పించాలని ఆదేశించారు. బుధవారం మంత్రుల నివాసంలో మంత్రితో టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు, సహకారశాఖ కమిషనర్ వీరబ్రహ్మయ్య, టెస్కాబ్ ఎండీ మురళీధర్ సమావేశమై చర్చించారు. హెచ్ఆర్ పాలసీ అమల్లోకి వస్తే 800 ప్యాక్స్లోని 2,500 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని, ఉద్యోగ భద్రత, పదోన్నతులు కలుగుతాయని తెలిపారు. కరోనా సమయంలో ధాన్యం కొనుగోళ్లలో కీలకంగా పనిచేస్తున్న ప్యాక్స్ను మంత్రి అభినందించారు. ప్యాక్స్ అధ్యక్షులకు గౌరవ వేతనం అంశాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.