ఆదిలాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Rule ) ఎన్నికల హామీలు ఆరు గ్యారెంటీ లతోపాటు 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి జోగు రామన్న ( Jogu Ramanna ) విమర్శించారు. గురువారం కాంగ్రెస్ ప్రభుత్వం వేయి రోజుల పాలన లో వ్యవసాయ రంగం సంక్షోభం ( Agricultural Sector Crisis ) లో కూరుకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఆర్ గ్యారంటీలో భాగంగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా పథకం కింద ఎకరాకు 15 వేల రూపాయలు, వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం హామీలు ఇచ్చి రైతులను మోసం చేసిందన్నారు. రెండు లక్షల రుణమాఫీ చేశామంటూ ముఖ్యమంత్రి అబద్ధాలు మాట్లాడుతున్నారని, రైతు భరోసా పథకాన్ని ఎగొట్టి పూర్తి స్థాయిలో చెల్లించినట్టు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని తెలిపారు.
రైతు బీమా పథకాన్ని రద్దు చేయడంతో అన్నదాతల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని తెలిపారు . రైతులు కష్టపడి సాగు చేసిన పంటలను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కరెంటు కోతల వల్ల రైతులు పంటలు సాగు చేసుకునే పరిస్థితి లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు . రైతుబంధు, రైతు బీమా ఇలాంటి పథకాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయని వెల్లడించారు.