హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాదిని వ్యవసాయ నామ సంవత్సరంగా ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి.. బడ్జెట్లో కోత పెట్టడం అన్యాయమని తెలంగాణ రైతు సంఘం విమర్శించింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు, ప్రధాన కార్యదర్శి టీ సాగర్ మాట్లాడుతూ ‘బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ.23,179 కోట్లు కేటాయించినట్టు ఆర్థికమంత్రి ప్రకటించారు. గత సంవత్సరం 24వేల కోట్లు కేటాయించగా, ఈ సంవత్సరం తగ్గించారు’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రకటనలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో వ్యవసాయ రంగంలో మాంద్యం పెరుగుతున్నదని వెల్లడించారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన కనీస మద్దతు ధరల నిర్ణయంకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు లేవన్నారు. హార్టికల్చర్ శాఖ పరిధిలో 12 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుండగా ఇందులో నల్లగొండ జిల్లాలోనే 4.5 లక్షల ఎకరాల్లో బత్తాయి పంటలు వేశారని తెలిపారు. అయితే ఈ సాగు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఎకరాలకు తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధరల ఆధారంగా పత్తి, వరి పంటలను మాత్రమే సాగు చేస్తున్నారని చెప్పారు. భూ భారతిని అమలు చేయడం వల్ల కౌలుదార్లకు ఆర్థిక రక్షణ లేకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ప్రతి సంవత్సరం దాదాపు 460 మంది ప్రాణాలు తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.