హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ) : ఈ విద్యాసంవత్సరం నుంచి నారాయణపేట జిల్లా కేంద్రంలో 40 సీట్లతో వ్యవసాయ పాలిటెక్నిక్ (కో-ఎడ్యుకేషన్) కాలేజీని ప్రారంభించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రి వర్సిటీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మంగళవారం వర్సిటీ ఆడిటోరియంలో జరిగిన 19వ అకడమిక్ కౌన్సిల్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నది. కేంద్ర రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆయిల్ సీడ్స్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ అవినాశ్ వనం తన పేరిట బంగారు పతకం అందించాలని విజ్ఞప్తి చేయగా, కౌన్సిల్ ఆమోదించింది. ఈ పతకం కోసం డాక్టర్ అవినాశ్ వనం 4 లక్షల సాయం అందించనున్నారు. దీనిపై వచ్చిన వడ్డీతో వరంగల్ వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో అత్యధిక ఓవరాల్ గ్రేడ్ పాయింట్ సాధించిన విద్యార్థికి ప్రతి ఏటా పతకాన్ని అందజేస్తారు.