బీర్కూర్, మే 4 : దేశంలో రైతుల కోసం సమగ్ర వ్యవసాయ విధానం రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. తెలంగాణలో మాదిరిగా రైతులకు 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతు బీమా, రాయితీ విత్తనాలు, ఎరువులు దేశవ్యాప్తంగా అందించి, దేశానికి సమగ్ర విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బొప్పాస్పల్లిలోని విత్తనాభివృద్ధి క్షేత్రంలో సుమారు రూ.4.85 కోట్లతో నిర్మించిన విత్తన శుద్ధి కర్మాగారం, గిడ్డంగుల సముదాయాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతుల రందీని తీర్చి, వ్యవసాయ ఉత్పత్తులను సాధించి దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారన్నారు. కేసీఆర్ తెచ్చిన రైతు పథకాలు బాగున్నాయని రైతులే అనడం గర్వంగా ఉన్నదన్నారు. తెలంగాణలో ఈ ఏడాది 2 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ పండించి రాష్ట్రం చారిత్రక విప్లవాన్ని సృష్టించనున్నదని తెలిపారు.
ఇతర పంటలపై దృష్టి సారించాలి: పోచారం
రైతులు ఒకే పంటపై కాకుండా ఇతర పంటలపైనా దృష్టి సారించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. రాష్ట్రంలోనే వరి వేయడంలో బాన్సువాడ ముందున్నదని, ఎకరానికి 60 బస్తాలను పండించే ప్రాంతం బాన్సువాడ మాత్రమేని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్నా చేపట్టినా కేంద్రం నోరు మెదపకపోవడం, రైతుల శ్రేయస్సు దృష్ట్యా ధాన్యం కొనుగోలు చేశారన్నారు. కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రాంరెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, టీఆర్యస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.