సంఘటితమైతే సాధించలేనిదేదీ లేదని నిరూపిస్తున్నది నల్లగొండ జిల్లా కట్టంగూరు రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్పీవో). జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) ఆధ్వర్యంలో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రోత్సాహంతో ఏర్పడిన ఈ ఎఫ్పీవో అనతికాలంలోనే అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నది. ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకుంటూ దళారుల ప్రమేయం లేకుండా రైతులు పండించిన పంటలను మంచి ధరకు విక్రయిస్తూ లాభాల బాటలో పయనిస్తున్నది.
కట్టంగూర్, సెప్టెంబర్ 3: నల్లగొండ జిల్లా, కట్టంగూర్ మండలం, అయిటిపాముల గ్రామపంచాయతీ పరిధిలోని గంగదేవిగూడెంలో 2018లో కట్టంగూర్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ కంపెనీ లిమిటెడ్ (ఎఫ్పీఓ) ఏర్పాటైంది. తొలుత 100 మంది రైతు సభ్యులతో ప్రారంభమై నేడు 900 మందికి చేరింది. ఈ సంఘానికి 2022 మేలో విత్తనాల అమ్మకం డీలర్షిప్ లభించింది. ఇప్పటివరకు సుమారు రూ.50 లక్షల నిమ్మ వ్యాపారం, రూ.కోటికి పైగా బత్తాయి, కూరగాయలు, ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందుల అమ్మకాలు జరిగాయి. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి ఎఫ్పీఓకు ముఖ్య సలహాదారుడిగా సేవలందిస్తున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం పనితీరు చూసిన విశ్రాంత ఉపాధ్యాయుడు మేరెడ్డి సత్యనారాయణరెడ్డి 2.30 ఎకరాల భూమిని ఉచితంగా సంఘానికి అందజేశారు. ఈ భూమిలో ఎఫ్పీఓ రైతులు ఆర్గానిక్ ఫాంహౌస్ ఏర్పాటు చేయనున్నారు. రైతులకు ఉత్తమ సేవలు అందిస్తున్న కట్టంగూరు ఎఫ్పీఓకు నాబార్డు తన 41వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు అందజేసింది.
12 కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు
మార్కెట్లో మద్దతు ధర వచ్చే వరకు రైతులు నిమ్మ, బత్తాయి తదితర ఉత్పత్తులను నిల్వ చేసుకునేలా రూ.2.35 కోట్లతో 120 కిలోవాట్ల సౌర విద్యుత్తుతో నడిచే 12 కోల్ట్ స్టోరేజీ యూనిట్లను ఏర్పాటుచేశారు. ఒక్కొక్క దాంట్లో 10 టన్నులు నిల్వ చేసే సదుపాయం ఉన్నది. కంపెనీ ఆవరణలో రూ.10 లక్షలతో గోదాములు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నిధుల నుంచి సుమారు రూ.70లక్షలతో షెడ్లు, దుకాణాల సముదాయాలు నిర్మించారు. నాబార్డు అనుబంధ సంస్థ అయిన నాబ్ కిసాన్ నుంచి మంజూరైన రూ.20 లక్షలతో వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేసి రైతులకు అద్దెకు ఇస్తున్నారు. మార్కెట్ కంటే 20శాతం తక్కువ ధరకు అద్దెకిస్తూ.. వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని సంఘంలో పనిచేసే డ్రైవర్లకు, సేల్స్ పర్సన్స్కు వేతనాలు ఇస్తున్నారు.
నిమ్మ ఒరుగుల తయారీ
మండలంలో నిమ్మ రైతులు ఎక్కువగా ఉండడంతో ఎఫ్పీఓలో నిమ్మ ఒరుగుల యూనిట్ను నెలకొల్పారు. హైదరాబాద్లోని రహేజా ఫుడ్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడంతో ఆ సంస్థ రూ.8లక్షల విలువ చేసే ఒరుగుల తయారీ యూనిట్ను 80 శాతం సబ్సిడీపై అందజేసింది. నిమ్మ ఒరుగుల తయారీలో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు.
సంఘం బలోపేతానికి సంఘటితంగా కృషి
తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి, ఎక్కువ లాభం పొందడమే ఎఫ్పీఓ ఏకైక లక్ష్యం. రైతులు, వ్యాపారుల మధ్య దళారులు లేకుండా చూస్తున్నాం.రైతులను ఆర్గానిక్ పంటలు పండించే దిశగా అవగాహన కల్పిస్తున్నాం.
– చౌగోని సైదమ్మ, కట్టంగూర్ ఎఫ్పీఓ చైర్మన్
ఎఫ్పీఓతో రైతులకు లాభసాటి
ఎఫ్పీఓ రైతులకు లాభసాటిగా మారింది. పంటలను ఎఫ్పీఓ కొని అమ్మిస్తే కనీస మద్దతు ధర లభిస్తుంది. నిమ్మ, బత్తాయికి రాష్ట్రంతోపాటు ఇతర రాష్ర్టాల్లో అధిక ధర ఉంటే అక్కడికి సంస్థ నేరుగా పంపిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఉత్పత్తులను నేరుగా మార్కెట్లో అమ్ముకోలేరు దేశంలో ఎక్కడ ఎక్కువ ధర ఉంటే సంస్థ ద్వారా అక్కడికి పంపించి అమ్ముకునే అవకాశం ఉంటుంది.
– రావుల విద్యాసాగర్, హార్ట్టికల్చర్ ఆఫీసర్, నకిరేకల్