హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి కూరగాయల ఎగుమతులు పెరగాలని, దీనికోసం రైతులు అనువైన ప్రమాణాలు పాటిస్తేనే నికర లాభాలు అందుతాయని ములుగులోని శ్రీ కొండాలక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ బీ నీరజా ప్రభాకర్ తెలిపారు. యూనివర్సిటీ విద్యార్థులకు హార్టికల్చర్ ఇండస్ట్రియల్ అటాచ్మెంట్ ప్రోగ్రామ్ కోసం హైదరాబాద్ లెమన్ చిల్లీ ఫార్మ్ సంస్థతో అవగాహన ఒప్పందం జరిగింది. వీసీ సమక్షంలో యూనివర్సిటీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం డైరెక్టర్ వై జనార్దన్రావు, లెమన్ చిల్లీ ప్రతినిధి రితీశ్ వెలూరు ఒప్పందంపై సంతకాలు చేశారు. అనంతరం వీసీ మాట్లాడుతూ కూరగాయల పంటల సాగులో దిగుబడులు, ఉత్పాదకతను పెంపొందించడంలో విశ్వవిద్యాలయం నుంచి సాంకేతిక సహకారంతో పాటు ఇన్పుట్ అందజేస్తామని తెలిపారు. నాణ్యమైన ఉత్పత్తులకు తగిన ప్రాముఖ్యత ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్, రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఏ భగవాన్, ఉద్యాన విస్తరణ డైరెక్టర్ డాక్టర్ ఏ కిరణ్కుమార్, పీజీ స్టడీస్ డీన్ డాక్టర్ ఎం రాజశేఖర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ డాక్టర్ నటరాజన్ శ్రీనివాసన్, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ డీ విజయ తదితరులు పాల్గొన్నారు.